Godavarikhani | కోల్ సిటీ, జూన్ 23 : రామగుండం నగర అభివృద్ధికి సహకరించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టీ.కే.శ్రీదేవిని నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ని ఒక హోటల్లో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్లకు మంగళవారం నిర్వహించిన ఓరియంటేషన్ కు రామగుండం మేయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ సెక్రెటరీని కలిసి నగరంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించినట్లు తెలిపారు.
ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణలో రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బయో మైనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సహకరించాలనీ, అలాగే పనికి రావనుకున్న వాటి నుంచి కూడా అద్భుతాలు సృష్టించే వస్తువుల తయారీ వేస్ట్ టు వండర్ యూనిట్లు స్వశక్తి మహిళల ద్వారా స్థాపించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలని కోరినట్లు తెలిపారు. మెరుగైన సేవలందించడానికి జనాభాకు తగినట్టుగా పారిశుధ్య సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారని మేయర్ తెలిపారు.