Mission Vatsalya | జమ్మికుంట, ఏప్రిల్ 12 : వివిధ కారణాలతో అనాథలుగా మారిన పిల్లలు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆలనాపాలనా చూసే వారు లేక దొరికిన పనిచేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. చదువుకు దూరమై కార్ఖానాలు, హోటళ్లు, దుకాణాల్లో పనిచేస్తూ బతుకువెళ్లదీస్తున్నారు. అలాంటి అభాగ్యుల చదువుకు భరోసానిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించాయి. దీని ద్వారా బాలబాలికల చదువు కోసం ప్రతి నెలా 4వేల ఉపకార వేతనాన్ని అందించాలని నిర్ణయించాయి. అర్హులందరూ అంగన్వాడీ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ అధికారులు సూచిస్తున్నారు.
మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తుకు బాలుడు/బాలిక జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, రేషన్ కార్డు, తల్లి/తండ్రి ఆధార్, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం(ఎవరిదైనా), మృతికి గ ల కారణ పత్రం, తల్లిదండ్రులు లేని పిల్లలు గార్డియన్ ఆధార్, రేషన్, కుల ధ్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్, బాలుడు/బాలిక సంబంధించిన పాస్పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు అకౌం ట్/ తల్లి, తండ్రి/సంరక్షకులకు సంబంధించిన జాయింట్ అకౌంట్ను జతచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులను స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో అందించాలి. తర్వాత సదరు దరఖాస్తులు సీడీపీవో కార్యాలయానికి కేంద్రం నిర్వాహకులు పంపిస్తారు. వాత్సల్య పథకం ఎంపిక కోసం స్పాన్సర్షిప్ అండ్ ఫోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ(ఎస్ఎఫ్సీఏసీ) ఉంటుంది. కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఉంటారు. కమిటీలో సెక్రటరీగా డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సభ్యులుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, రిప్రజెంటివ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆడాప్షన్ ఏజెన్సీ, చైల్డ్ ప్రొటెక్షన్ స్వచ్ఛంద సంస్థ, నాన్ ఇన్స్టూషనల్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు ఉంటారు. వచ్చిన దరఖాస్తులను స్కూట్నీ చేసి అర్హులను ఎంపిక చేస్తారు.
తల్లిదండ్రులను కోల్పోయినా, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ లేకపోయినా, విడాకులు తీసుకున్నా (పాక్షిక అనాథలు), దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కుటుంబం వదిలి వెళ్లినా, శారీరక అసమర్థులు, బాల యాచకులు, హెచ్ఐవీ, కొవిడ్, బాలకార్మికులు, సంరక్షణ చట్టం-2015 ప్రకారం ఇండ్లులేని నిరుపేదలు, పేదరికంలో ఉండి ఇంటి పెద్దను కోల్పోయినా, ప్రకృతి వైపరీత్యానికి గురైన బాల కార్మికులు, అక్రమ రవాణా, దాడులకు గురైనా, బాల్య వివాహాలు, పీడిత బాలలు, దివ్యాంగులు, తదితరులు ఈ పథకానికి అర్హులు. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 72వేలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి 96వేల లోపు ఇన్కం సర్టిఫికెట్ జతచేయాలి.
ఇది పాత స్కీమే. గతంలో ఐసీడీఎస్ నుంచి ఇచ్చేవాళ్లం. అప్పుడు నెలకు 500 నుంచి 2వేల వరకు వచ్చేవి. గత సంవత్సరం 65మంది పిల్లలకిచ్చినం. ఇప్పుడు వాత్సల్యగా స్కీం పేరు మారింది. ఈ నెల 15 లాస్ట్ డేటంటూ ఏం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేయించుకోవాలని సూచించినం. అనాథలను గుర్తించాలని చెప్పినం. ఆలస్యమైనా దరఖాస్తులు తీసుకుంటం.
– సబితా కుమారి, డీడబ్ల్యూవో (కరీంనగర్)