కార్పొరేషన్, ఏప్రిల్ 2: కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు తదితర అన్ని వెహికిళ్లలో బీఎస్ 6 ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 (2.0)రెండో దశను అమల్లోకి తెచ్చింది. దీంతో వాహనాల తయారీ దారులు కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రత్యేక పరికరాలను అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వెహికిళ్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.
పొల్యూషన్ కంట్రోలే టార్గెట్..
దేశంలో వాహనాలు విడుదల చేసే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రెండేళ్ల కిత్రం బీఎస్ 6 ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి బీఎస్ 6 సెకండ్ ఫేస్ను ఆచరణలోకి తీసుకువచ్చింది. బీఎస్ 6 2.0గా పిలిచే ఈ దశలో ఆటోమొబైల్ తయారీ కంపెనీలు రియల్ డ్రైవింగ్ ఎమిషన్(ఆర్డీఈ) ప్రమాణాలను తప్పసరిగా పాటించాలి. వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్యం తగ్గించే లక్ష్యంతో యూరో ఎమిషన్ ప్రమాణాల ఆధారంగా 2000లో దేశంలో తొలిసారి భారత్ స్టేజ్ 1 ప్రమాణాలను మొదలుపెట్టారు. వీటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) రూపొందించింది. తర్వాత వీటిని క్రమేణా 2, 3, 4గా పెంచుతూ వచ్చారు. 2020లో కేంద్రం ఏకంగా బీఎస్ 6 ప్రమాణాలను పాటించాలని నిర్దేశించింది. ఈ నిబంధనల ప్రకారం వాహనాలు విడుదల చేసే కార్బన్ డైయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి వాయువులు పరిమితిని దాటకుండా చూడాలి.
ఇందులో భాగంగా వాహన తయారీ కంపెనీలు వాహనాలు విక్రయించే ముందు వాటిని ఉద్గారాల విడుదలను ప్రయోగశాలల్లో పరీక్షించి బీఎస్ 6 ప్రమాణాలకు లోబడి ఉంటేనే మార్కెట్లోకి విడుదల చేయాలి. కాగా, బీఎస్ 6 2.0 దశలో ఈ ప్రమాణాలను మరింత కఠినతరం చేశారు. దీంతో ఇప్పటి వరకు వాహన ఉద్గారాల పరిమితిని లేబోరేటరీల్లో పరీక్షించిన ఆటోమొబైల్ సంస్థలు, వీటితో పాటుగా ఆర్డీఈ ప్రమాణాలను కూడా పాటించాలి. అంటే లేబోరేటరీ పరీక్షలు, వాహనం విక్రయించిన తర్వాత అది విడుదల చేసే ఉద్గారాలను మరింత తగ్గించేందుకు పోర్టబుల్ ఎమిషన్స్ మేజర్మెంట్ సిస్టమ్ (పీఈఎంఎస్)ను అన్ని వాహనాల్లోనూ బిగించాల్సి ఉంటుంది. డీజిల్ ఆధారిత వాహనాల్లో సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ (ఎస్సీఆర్) అనే డివైజ్ అదనంగా అమర్చాలి. ఇది డీజీల్ ఎగ్జాస్ట్ ప్లూయిడ్ను ఉపయోగించి నైట్రోజన్ ఆక్సైడ్స్లోని వాయువులను నీరుగా మార్చి విడుదల చేస్తుంది. ఈ వివరాలన్నింటిని ఎప్పటికప్పుడు కారు నడిపే వ్యక్తికి తెలియజేసే విధంగా అన్బోర్డు సెల్ప్ డయాగ్నస్టిక్ డివైజ్ (ఓబీడీ)ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ డివైజ్ డ్రైవర్కు ఆ వాహనం నుంచి వెలువడే వాయువులకు సంబంధించిన సమాచారంతో పాటుగా కారు నడిపే విధానంలో జరిగే మార్పులు, ట్రాఫిక్ పరిస్థితులు వంటి వాటిని కూడ డిస్ప్లే అవుతుంది. ఒక వేళ వాయువులు నిర్ధిష్ట పరిమితికి మించినట్లుగా గుర్తిస్తే వెంటనే సర్వీస్ చేయించాలని డిస్ప్లే సూచిస్తుంది. దీంతో పర్యావరణకాలుష్యం తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైక్ల్లో ఉపయోగిస్తున్న కార్బొరేటర్ల స్థానంలో ప్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ (ఎఫ్ఐఎస్)ను ఉపయోగించటంతో పాటుగా ఓబీడీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాహనాల్లో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా ధరలు గణనీయంగా పెరుగుతాయని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.