Sircilla | మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ‘కిరణం’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలోనే తొలిసారిగా సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో మానసిక వైద్య నిపుణులు, సైకలాజిస్ట్లు, సైక్రియాటిస్ట్లను నియమించింది. నిరంతరం సేవలందిచేలా 1800425 3333 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా ప్రజలు వినియోగించుకొనేలా ఈ వినూత్న కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవనంలో ఎంతో మంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఆత్మైస్థ్థెర్యం కోల్పోయి, నిరాశకు గురై, నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. సరైన లక్ష్య నిర్దేశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించుకోలేక బతుకులకు ఛిద్రం చేసుకుంటున్నారు. కొందరు మనోధైర్యాన్ని కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ‘దారి’ చూపాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో ‘కిరణం’ ప్రాజెక్ట్ను లాంఛనంగా ప్రారంభించింది. కిరణం సలహా కేంద్రాన్ని జిల్లా కలెక్టరేట్లోని మూడో అంతస్థులో ఏర్పాటు చేశారు. ఈ నెల 3న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పోస్టర్, టోల్ ఫ్రీ నంబర్ను వైద్యాధికారులతో కలిసి ఆవిష్కరించారు.
మానసిక సమస్యలు, ఒత్తిళ్లతో బాధపడుతున్నవారు టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే బాధితుడి సాధారణ వివరాలను నమోదు చేసుకుంటారు. సైకాలజిస్ట్లు, సైక్రియాటిస్ట్లు, కౌన్సిలర్లు బాధితుడికి తొలుత ఫోన్లోనే కౌన్సెలింగ్ చేస్తారు. మానసిక సమస్యలను ఎలా అధిగమించాలో దిశానిర్దేశం చేస్తారు. అక్కడ బాధితుడి లక్షణాలను బట్టి కౌన్సెలింగ్ ఇస్తారు. సమస్యతీవ్రత ఎక్కువగా ఉంటే వారిని జిల్లా దవాఖానలోని కౌన్సెలింగ్ సెంటర్కు రెఫర్ చేస్తారు. వీటిలో అత్యవసర, సాధారణ సమస్యలను బట్టి కౌన్సిలర్లు వారికి మనోధైర్యాన్ని కల్పిస్తారు. అవసరమున్న మందులను కూడా అందిస్తారు. రోగి కోలుకునేంత వరకు ఫాలో అప్ చేస్తారు
కిరణం కౌన్సెలింగ్ కేంద్రంలో 12 మంది మానసిక వైద్య నిపుణులను నియమించారు. వీరిలో ఇద్దరు సైకాలజిస్ట్లు, ఇద్దరు సైక్రియాటిస్ట్లు, పది మంది కౌన్సిలర్లు ఉంటారు. రోగి మానసిక పరిస్థితి బట్టి కౌన్సిలింగ్ అందిస్తారు. అలాగే మానసిక సమస్యలను అధిగమించడానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా కిరణం టోల్ఫ్రీ నంబర్ 1800 425 3333ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం మానసిక ఆరోగ్యం కోసం సిరిసిల్లలో కిరణం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో మానసిక వైద్య నిపుణులను అందుబాటులో ఉంచింది. ప్రజలు మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తొలిదశలోనే గుర్తించి తగిన కౌన్సెలింగ్ తీసుకుంటే మంచిది. ఈ అవకాశాన్ని ఆత్మైస్థెన్యం దెబ్బతిన్న వారంతా వినియోగించుకోవాలి. అవసరమున్నవారు టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి.
-పున్నం చందర్, సైకాలజిస్ట్