CCTV cameras | వీణవంక, మార్చి 31 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు తోడ్పాటనందిస్తాయని, ఒక్క సీసీ కెమెరా వెయ్యి మంది పోలీసులతో సమానమని కరీంనగర్ అడిషనల్ డీసీపీ (లా అండ్ ఆర్డర్) వెంకటరమణ అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో గ్రామస్థుల సహకారంతో రూ.1.90 లక్షలతో 13 సీసీ కెమెరాలు ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ హుజూరాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని, ఇప్పటికే పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరం జరిగినపుడు దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, పెద్ద పెద్ద నేరాలను కూడా సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలంరినీ ఈ సందర్భంగా అభినందించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
అనంతరం పోలీసు అధికారులను, దాతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామిడి సంపత్ రెడ్డి, ఉపసర్పంచ్ ఫసియొద్దీన్, పాలకవర్గ సభ్యులు, నాయకులు ఎల్కపెల్లి లక్ష్మణ్, పొదిల రమేష్, తిరుపతి, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.