ఉమ్మడి పాలనలో చిన్నాభిన్నమైన కులవృత్తిదారులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. అందులో భాగంగా నాయీబ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. సబ్సిడీ రుణాలు మంజూరు చేసి, సెలూన్లకు ఉచిత కరెంట్ ఇచ్చి ఆర్థిక భరోసా ఇచ్చింది. ఇదే కోవలో వారికి సముచిత గౌరవం ఇచ్చేందుకు సంఘ భవనాలు, కల్యాణమండపాలు, విద్యార్థులకు హాస్టళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు స్థలం కేటాయించి నిర్మాణానికి నిధులు ఇవ్వడంపై సామాజిక వర్గంలో హర్షం వ్యక్తమవుతున్నది.
– తెలంగాణచౌక్, ఏప్రిల్ 8
కరీంనగర్ తెలంగాణచౌక్, ఏప్రిల్ 8 : సమైక్య పాలనలో ఉనికి కోల్పోయిన కుల వృత్తులు నేడు జీవం పోసుకున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో కుల వృత్తిదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని నాయీ బ్రాహ్మణ కులస్తులకు సంఘం కార్యాలయం, కల్యాణ మండపం, విద్యార్థుల వసతి గృహం నిర్మాణం కోసం ఉచిత స్థలాలతో పాటు నిర్మాణం కోసం నిధులను మంజూరు చేశారు.
సీఎం కేసీఆర్ 2008లో కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘ భవనం కోసం రూ. 3లక్షలను అందజేశారు. ఆ డబ్బులలో వావిలాలపల్లిలో 800 గజాల స్థలం కోనుగోలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఉజ్వల పార్కుల వద్ద ప్రభుత్వ స్థలం పది గుంటలతో పాటు 25 లక్షలు కేటాయించగా అక్కడ విద్యార్థి వసతి గృహాన్ని నిర్మించారు.
అంతే కాకుండా నగరంలో ఉన్న 450 సెలూన్ షాపుల నిర్వాహకులు, 950 మంది సభ్యులు శుభ కార్యక్రమాల అవసరాల కోసం తీగలగుట్టల పల్లి వద్ద గల 800 గజాల స్థలంలో కల్యాణ మండప నిర్మాణం కోసం మంత్రి గంగుల రూ.40లక్షలను కేటాయించారు. ఆ నిధులతో 24 ఫిల్లర్లతో అధునాతన డిజైన్తో కల్యాణ మండప నిర్మాణం చేపట్టారు. దీని కోసం అదనంగా మరో రూ.40 లక్షలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్వీర్యమైన కులవృత్తులకు ప్రస్తుతం బీఆర్ఎస్ పాలనలో గుర్తింపు లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటాం
గత పాలకుల హయాంలో కుల వృత్తుదారులను పట్టించుకోలేదు. ఎన్నో కష్టాలు పడ్డం. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తుదారులకు గుర్తింపు తీసుకొచ్చిండ్రు. మేమందరం కూర్చొని సమస్యలపై మాట్లాడుకునేందుకు అడ్డాలు లేకుండె. ఎక్కడనో ఊరు బయట మైదానాల్లో మీటింగ్లు పెట్టుకొని కష్టసుఖాలు చెప్పుకునేటోళ్లం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. సీఎం కేసీఆర్ పారు అందరితోపాటు మాకు కూడా సహకారం అందిస్తుండ్రు.
సంఘ భవనం, కల్యాణ మండపం, విద్యార్థుల హాస్టళ్లను కట్టుకుంటున్నం. మా కోసం దాదాపు కూ.కోటితో కల్యాణ మండపం నిర్మిస్తున్నరు. హైదరాబాద్ బాల సింగం వద్ద భవనానికి రెండెకరాల జాగతోపాటు రూ.రెండుకోట్లు కేటాయించిండ్రు. మాకు ఇట్ల గుర్తింపు వస్తదని, కలల గూడా అనుకోలె. ఎప్పటికైనా మేం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– నీలం మొండయ్య నాయీ, తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
మంత్రి సహకారం మరువలేం
మా కులస్తులకు మంత్రి గంగుల కమలాకర్ చేసిన సహకారం మరవలేం. అడిగిన వెంటనే స్థలంతోపాటు నిధులను మంజురు చేసిండ్రు. పిలిచి ప్రొసీడింగ్లు ఇచ్చిండు. జిల్లా, నగరం కమిటీ సమావేశాలను నిర్వహించుకుంటున్నం. కల్యాణ మండపం పూర్తయితే మా అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కరోనా టైంల 900 కుటుంబాలకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలను అందించారు. సబ్బిడీ రూపంలో అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తో నెలకు రూ.2వేల వరకు ఆదా అవుతున్నయ్.
-జంపాల సంపత్ నాయీ, తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ అధ్యక్షుడు