రాంనగర్, జూన్ 30 : కరీంనగర్లోని భగత్నగర్ క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. శుక్రవారం ఉదయం ఆమె బంధువులు వచ్చి తాళం పగులగొట్టి చూసే సరికి మృతి కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సరిత (38)కు మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన శ్రీపాల్రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు అశ్విత్రెడ్డి (16), మణిత్రెడ్డి (14). మృతురాలి భర్త శ్రీపాల్రెడ్డి వ్యాపారం చేస్తుండగా, కొడుకులు చదువుకుంటున్నారు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. సరిత రాంనగర్లోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ తన సోదరుడి షాపు వ్యవహారాలు చూసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నది.
ఈ క్రమంలో భగత్నగర్కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించింది. ఈ వ్యాపారానికి సంబంధించి 20 లక్షలు సరితతో పెట్టుబడి పెట్టించిన వెంకటేశ్ ఆ డబ్బులు ఇవ్వకుం డా దాట వేస్తూ వచ్చాడు. బుధవారం డబ్బులు ఇస్తానని భగత్నగర్లోని తన అపార్టుమెంట్లోని ప్లాటుకు పిలిపించుకోవడంతో సరిత తాను వరంగల్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెంకటేశ్ వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం లేదు. శుక్రవారం ఉదయం సరిత ఫోన్ నుంచి ఆమె సోదరి స్వాతి, సోదరుడు సతీశ్ నెంబర్లకు ‘మీ అక్క తల గోడకేసుకొని కొట్టుకొని, దెబ్బలతో నా ప్లాట్లో పడి ఉంది. వెళ్లి తాళం పగులగొట్టుకొని తీసుకెళ్లండి’ అని సందేశం వచ్చింది. సందేశాలకు ఎటువంటి సమాధానం రాకపోవడంతో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు వాట్సాప్ వాయిల్ కాల్ చేసి ‘మేసేజ్లకు రిైప్లె ఇవ్వడం లేదు.
మీ అక్క నా ప్లాట్లో పడి ఉంది’ అని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంటనే స్వాతి తన సోదరుడితో కలిసి అక్కడికి వెళ్లి తాళం పగులగొట్టి చూడగా, సరిత తీవ్ర గాయాలతో ముక్కు, నోటి నుంచి రక్తస్ర్తావమై గొంతుకు చున్నీతో బిగించి ఊపిరాడక మృతి చెంది కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి క్లూస్ టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సరితకు డబ్బులు ఇస్తానని పిలిచి వెంకటేశ్ ఆమెను దారుణంగా హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. రెండు నెలల క్రితమే విబేధాలు పక్కన పెట్టి శ్రీపాల్రెడ్డి, సరిత కలిసి ఉంటుండగా, ఇంతలో ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది.