కరీంనగర్, మార్చి7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ రూరల్, మార్చి 7: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కరీంనగర్లో పర్యటించారు. జిల్లాకేంద్రంలో పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం కరీంనగర్ మండలం ఇరుకుల్లలో ఎండిపోయిన పంటలను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీ వినోద్కుమార్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘కేసీఆర్ పాలనలో కాలంతో పొంతన లేకుండా నీళ్లు ఇచ్చిన్రు. రెండు పంటలు పండించుకున్నం. గట్లనే నీళ్లత్తయిని ఈసారి కూడా వరి ఏసుకున్నం. కానీ, మోసం జరిగింది. నీళ్లత్తలేవు. మా కండ్లముందే పంటలు ఎండుతున్నయి. అడ్డగోలు ఖర్సులు పెట్టుకున్నం.
మాకు చావు తప్ప మారో గతే కనపడుత లేదు’ అంటూ తమ అవేదన వ్యక్తం చేశారు. ఎర్ర శ్రీనివాస్ తన ఎండిపోయిన పంటను చూపించారు. ‘సార్.. పదేండ్లలో ఇటువంటి దరిద్రాన్ని నేను చూడలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు మత్తు నీళ్లొచ్చినయి. రెండు పంటలు వేసుకున్న. ఇప్పుడు జూడు పొలం పర్రెలు పెట్టింది. ఏమి జేయాలో అర్థమైతలేదు. ఇంత మోసం అయితదని అనుకోలే’ అంటూ ఆవేదన చెందాడు. మరో రైతు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇప్పటికే నా రెండెకరాలు ఎండిపోయింది. ఇంకో రెండెకరాలు గూడా ఎండిపోయేటట్టున్నది. చుక్క నీళ్లు ఇస్తలేరు. గింత అన్యాయమా? నాకు మనసున పడుతలేదు. మందు తాగి లెటర్ పెట్టి సచ్చిపోతా సర్’ అంటూ ఆక్రోషం చెందాడు.
వెంటనే జోక్యం చేసుకున్న కేటీఆర్, ‘శ్రీనివాసరెడ్డి మీకు న్యాయం జరిగే వరకు మేం పోరాడుతం. అంతే తప్ప చావు సమస్యకు పరిష్కారం కాదు. దయచేసి చెబుతున్న. అటువంటి ఆలోచన ఎవరూ చేయద్దు. బతికుండి కొట్లాడుదాం. న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీద్దాం’ అంటూ ధైర్యం నింపారు. ఇంకో రైతు తోట వేణు ‘వ్యవసాయ బావులకు త్రీఫేస్ కరెంటు రాత్రి 11 గంటల నుంచి ఇస్తామని అధికారులు మాకు మెసేజ్లు పెడుతున్రు’ అంటూ తన సెల్ఫోన్లోని మెసేజ్ను చూపించగా, అక్కడే ఉన్న మంద తిరుపతి, మరికొంత మంది రైతులు కూడా స్పందించారు.
ఇప్పటికే లో ఓల్టేజీ కరెంటు వస్తుంది. మోటర్లు కాలిపోతున్నయి. రాత్రి పూట మళ్లీ బాయి కాడ పండుకునే దుస్థితి దాపురించింది’ అంటూ అవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను విన్న కేటీఆర్, ‘మీరు ఎవరూ ఆధైర్య పడొద్దు. నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడుగుతం. అలాగే, పంట నష్ట పరిహారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తం. క్వింటాల్కు రూ.500ల బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తం’ అని హామీ ఇచ్చారు. ‘మళ్లీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. కష్టాలు వస్తయి.. పోతయి. కానీ చావు అనేది ఏ సమస్యకూ పరిష్కారం కాదు’ అని రైతులకు విన్నవించారు.
కాంగ్రెస్ ఏనాడూ ఎవుసాన్ని పట్టించుకోలె. సాగునీళ్లు ఇవ్వక, కరెంట్ సక్రమంగా ఇవ్వక అరిగోస పెట్టింది. బీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత ఎవుసం బాగుపడ్డది. ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇయ్యడంతో పదేండ్లుగా ఏ బాధా లేకుంట బతికినం. కానీ మళ్లీ కాంగ్రెస్ సర్కారు వచ్చుడేందోగానీ.. పాత కథే అయితంది. ఎస్సారెస్సీ కాలువ నీరు సరిగ్గా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నయ్.
– మంద తిరుపతి, రైతు (గోపాల్పూర్)
నాకు ఇరుకుల్లలో రెండెకరాల భూమి ఉంది. 15 ఏండ్లుగా వరి వేస్తున్న. పానీ నైయారా..? పై నుంచి నీరు రాకపోవడంతో పంట ఎండిపోతంది. రాత్రి పుట కరెంట్తో ఇబ్బందైతుంది. ట్రాన్స్ఫార్మర్లతో లో వోల్టేజీ సమస్య అధికంగా ఉంది. మోటర్ల కాలిపోతున్నయి.
– మహ్మద్ బాషు, రైతు (ఇరుకుల్ల)
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరివ్వాలి. ఒక్క ఇరుకుల్లలో కాకతీయ కాలువ కింద దాదాపు 500 ఎకరాల్లో పంట ఎండిపోయే దుస్థితి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులే చెబుతున్నరు. ఎస్సారెస్పీలో నీళ్లున్నా రాజకీయ కక్ష కట్టి కొన్ని నియోజకవర్గాలకు నీరు ఇస్తూ.. మరికొన్నింటికి ఇవ్వకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నరు. రాత్రి 11 గంటల నుంచి త్రీఫేజ్ కరెంటు ఇస్తామని ఎన్పీడీసీఎల్ వారు డైరెక్ట్గా రైతులకు మెసేజ్లు చేస్తున్నట్టు పలువురు నా దృష్టికి తెచ్రిన్రు.క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే సీఎం మాత్రం కోతలు లేవంటున్నరు.
కాలం బాగా కాలేదని, కరువు వచ్చే అవకాశం ఉందని సీఎం చెబుతున్నరు. అయితే, ఇది కేవలం కాంగ్రెస్ తెచ్చిన కరువే. కాలం ద్వారా వచ్చింది కాదు. ఆఖరికి ఒక రైతు అయితే ‘అన్నా నేను ఉత్తరం రాసి సచ్చిపోత అంటున్నడు. ఇయాళ నా పదెకరాల పంట పోయింది. ఎవరు బాధ్యులు’ అని అడుగుతున్నడు. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేముంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ వద్ద ఒక కాపర్ డ్యాం కట్టి, కనీసం ఒక్క పంపన్నా చాల్ చేసి నీళ్లియ్యాలి.
– ఇరుకుల్ల పంటల పరిశీలన సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్