జగిత్యాల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాలకు వచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరు సంజయ్కుమార్ను పరామర్శించారు. సంజయ్కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హన్మంతరావు గత నెల 29న మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్లో నిర్వహించిన హన్మంతరావు స్వర్గపాత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత హాజరయ్యారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ హెలిక్యాప్టర్లో రాగా, జగిత్యాల కలెక్టరేట్లోని హెలీప్యాడ్ వద్ద జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వాహనంలో విరూపాక్షి గార్డెన్కు ఆయన చేరుకున్నారు. మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి హన్మంతరావు చిత్రపటానికి పూలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్తోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దాదాపు ఆరున్నర దశాబ్దాలకు పైగా న్యాయవాద వృత్తికి హన్మంతరావు చేసిన సేవలను కేసీఆర్ కొనియాడారు. కాగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు పరామర్శించారు.