చిగురుమామిడి, మార్చి 22: ‘రాజకీయాల్లో గెలుపుపోటములు సహజం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదు. బలమైన ప్రతిపక్షంగా నిలబడుదాం. ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలపై నిరంతరం ఉద్యమిద్దాం’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ నివాసం సింగాపూర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి చిగురుమామిడి మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయనకు ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కేవలం మూడు లక్షల జనాభా మాత్రమే ఉన్న కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి, కేంద్రం నుంచి రూ.1000 కోట్లు తీసుకువచ్చానని గుర్తుచేశారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దానని పేర్కొన్నారు. జాతీయ రహదారుల కోసం పార్లమెంట్లో కొట్లాడి కరీంనగర్ చుట్టుపకల నాలుగు జాతీయ రహదారులు నిర్మాణం చేయించామని చెప్పారు. రైల్వే ప్రాజెక్టు పనులను చేయించామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తామని నేడు రైతులను విస్మరించిందని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ పగుళ్ల సాకుతో యాసంగి సీజన్లో ప్రాజెక్టులను ఎండబెట్టిందని, రైతుల పంటలకు నీరు రాకుండా చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి సరైన కరెంటు సైతం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల సమయంలో కింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలను ఎండగట్టాలన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ ఎంపీపీ అందె సుజాత, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.