రాయికల్/ ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 13: దొంగ హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. కానీ, నాలుగు నెలల రేవంత్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, రైతులు సాగునీరందక, కరెంట్ రాక చుక్కలు చూస్తున్నారని చెప్పారు. శనివారం జగిత్యాల ఇబ్రహీంపట్నం, రాయికల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు.
అంతకుముందు ఇబ్రహీంపట్నంలో ముమ్మర ప్రచారం చేశారు. ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విలువలతో కూడిన రాజకీయం చేశారని, కానీ రేవంత్రెడ్డి కమర్షియల్ చేశారని విమర్శించారు. రేవంత్రెడ్డి నేతృత్వంలో ఇప్పుడున్నది డూప్లికేట్ కాంగ్రెస్ అని..ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఒరిగేదేమీ ఉండదన్నారు. ఎంపీ అర్వింద్ హయాంలో నిజామాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సున్నా అని, ఆయన మాటలు తప్పా చేసిందేమీలేదని ఆగ్రహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి పాల్గొన్నారు.