హుజూరాబాద్టౌన్, డిసెంబర్2: ‘హుజూరాబాద్ నియోజకవర్గంలో నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ విజయం. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావడం ఖాయమని’ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం నాయకులు, కార్యకర్తలు కలువగా వారితో మాట్లాడారు.
హుజూరాబాద్లో విజయం సాధించిన పార్టీనే మొదటి నుంచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నదని, ఈ సారి కూడా అదే పునరావృతమవుతుందని చెప్పారు. అనుకోని పరిస్థితుల్లో హంగ్ వచ్చినా ప్రభుత్వం మనదేనని పేరొన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు, పరిచయాలతో బీఆర్ఎస్కు పరోక్షంగా దోహదపడిందని, వివిధ కుల సంఘాలు, వివిధ యూనియన్లు ఈ ఎన్నికల్లో తనకు పూర్తిగా సహకరించాయని చెప్పారు. అయితే కొందరు సొంత పార్టీ వారే పరోక్షంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేశారని, ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు శక్తికి మించి పనిచేశారని, వందశాతం గెలుస్తామని చెప్పారు.