గోదావరిఖని, డిసెంబర్ 1: రామగుండం నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్బెల్ట్ కార్మికులందరూ కార్మిక పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కే మద్దతిచ్చారని పేర్కొన్నారు. శుక్రవారం ఖని చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని ఎత్తులు వేసిన వాటన్నిటిని ప్రజలు పటాపంచలు చేశారన్నారు.
సైలెంట్గా సాగిన ఓటింగే తనను గెలుపునకు కారణమవుతుందన్నారు. రామగుండం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఒక రోజులో 24 గంటలకు గానూ 18 గంటలు ఏడాదిలో 365 రోజులకు గానూ 350 రోజులు తాను ప్రజా సేవలోనే ఉన్నానని చెప్పారు. నిస్వార్థంగ తాను చేసిన సేవకు గుర్తింపుగా ఓటర్లు ఓటు వేసారని పూర్తి నమ్మకం తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి ఎన్నికల్లో తనకు స్పష్టంగా తీర్పునిస్తూ వస్తున్న రామగుండం ప్రజలు ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రామగుండంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు బేరీజు వేసుకొని ఓటు వేశారని చెప్పారు. తన గెలుపు కోసం రెండు నెలలుగా ఎడతెరిపి లేకుండా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నయాపైసా, మద్యం పంచకుండా గెలుస్తున్నాని ధీమా వ్యక్తం చేశా రు. సమావేశంలో నాయకులు కౌశిక హరి, గోపు ఐలయ్య, ఆముల నారాయణ, దేవరాజ్, పర్లపల్లి రవి, జేవీ రాజు పాల్గొన్నారు.