కరీంనగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్లో నిరంతరం అందుబాటులో ఉంటూ పట్టుబట్టి అభివృద్ధి పనులు చేస్తున్న గంగుల కమలాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తే కమలాకర్ మళ్లీ పెద్ద పొజిషన్లో ఉంటాడని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరై, దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ అభివృద్ధి గురించి వివరిస్తూనే.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తూర్పారబట్టారు. ఇంకా అనేక అంశాలను ప్రజలకు ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే..
ఈ రాష్ర్టాన్ని ప్రగతిశీల, క్రియాశీల పద్ధతుల్లో ప్రగతి పథంలో తీసుకపోతున్నదెవరు? అలాగే, రాష్ట్ర విచ్ఛిన్నతికి ప్రజానీకాన్ని డివైడ్ చేసి స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్నదెవరో..? గమనించాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చైతన్యవంతమైన కరీంనగర్ బిడ్డలు ఇతర పార్టీలకు కర్రు కాచి వాత పెట్టాలి. ఉద్యమాల గడ్డ బిడ్డలందరూ బాగా ఆలోచించి ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఒక్క పనిచేయని బీజేపీకి ఒక్క ఓటు వేయద్దు. ఇప్పటికే గోల్మాల్ అయి బాధపడుతున్నరు. వినోద్ ఉన్నప్పుడు ఎట్లున్నదో.. ఇప్పుడెట్ల ఉన్నదో ఆలోచించాలి. బీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. అందులో ఎటువంటి సందేహం లేదు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ. అన్ని కులాలు, వర్గాలను సమానంగా చూసే పార్టీ. కరీంనగర్లో నిరంతరం అందుబాటులో ఉంటూ.. పట్టుబట్టి అభివృద్ధి పనులు చేస్తున్న గంగుల కమలాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తే కమలాకర్ మళ్లీ పెద్ద పొజిషన్లో ఉంటడు. అందుకే అన్నీ ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించి ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలి.
కరీంనగర్ పట్టణం ఇప్పుడు ఎంత సుందరంగా తయారైంది. అందుకే కరీంనగర్ను నగరం అని పిలువాలనిపిస్తుంది. మీ బిడ్డ గంగుల కమలాకర్ మొండి మనిషి. పట్టిన పట్టు విడువడు. వెంటపడి మానేరు రివర్ ఫ్రంట్ కట్టిస్తుండు. ఇవ్వాళ కరీంనగర్ చౌరస్తాలు ఎట్లయినయి. రోడ్లు ఎట్లయినయి. కరీంనగర్ సందు లు దుమ్ము ధూళి లేకుండా ఎలా అయినయో.. ఒక్కసారి ఆలోచించాలి. స్పష్టంగా అద్దంలో చూపించిన తేడా కనిపిస్తుంది. వాళ్ల ది ప్రభుత్వమే.. మనది ప్రభుత్వమే. అప్పుడు ముఖ్యమంత్రులున్నరు. నాకన్నా దొడ్డుగా, ఎత్తుగా ఉన్న వాళ్లే చాలా మంది ఉండిరి. మరి అప్పుడు ఈ అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఇప్పుడెందుకు జరిగింది? ప్రజలపై అభిమానంగా ఉండి పనిచేసే ప్రభుత్వం ఉంటే ఎలా ప్రగతి ఉంటుందో దానికి కరీంనగరే నిదర్శనం.
ఇప్పుడు తీగల వంతెన మాత్రమే పూర్తయింది. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పటికే సందర్శకులు వచ్చిపోతున్నరు. ఒకసారి మానేరు రివర్ఫ్రంట్ పూర్తయితే బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతంగా కరీంనగర్ నగరం మారుతుంది. 410 కోట్లతో పనులు మీ కళ్ల ముందే ముమ్మరంగా జరుగుతున్నయి. కేబుల్ బ్రిడ్జి దగ్గర ముత్తంత డాంబర్ కాలిందని దాన్ని కూలగొట్టాలని మాట్లడుతున్నరు కొంత మంది సన్నాసులు. వాళ్లకేమైనా తలకాయ బుద్ధి ఉందా.. అసలు? వాళ్లకు అభివృద్ధి అంటే ఏందో తెలుస్తదా..? ఒక్క విషయం మీరు గుర్తుకు పెట్టుకోవాలి. రాళ్లు ఎవరిపై పడుతయి? కాయలు ఉన్న చెట్టుపైనే పడుతయి. నాలుగు పనులు చేస్తే అందులో ఒకటి దొరకవట్టి.. ఈక మీద తోక.. తోక మీద ఈక అని మాట్లాడతరు.
ఏమీ చేయకుండా ఇంట్ల పంటె గొప్పోడు అన్నట్లుగా ఉంది వాళ్ల ప్రవర్తన. మంచి ప్రయత్నం చేసి.. మంచి పనులు చేస్తుంటే అపనిందలా..? గతంలో కరీంనగర్లో మంచినీళ్ల గోస ఎట్లుండె. తలాపున మానేరు డ్యాం ఉన్నా రెండు మూడు రోజులకు కూడా నీళ్లు వచ్చేవి కావు. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా..? ఈ విషయంలో కమలాకర్, వినోద్కుమార్ నాతో చర్చించి దీనికి ప్రత్యేకంగా డబ్బులు తెచ్చి పనులు చేస్తే ఇప్పుడు ప్రతి రోజూ నీళ్లు వస్తున్నయి. నేను మీ అందరికీ మనవి చేస్తున్న. ఒక్క రూపాయికి నల్లా కనెక్షన్ ఎవరైనా ఇచ్చిన్రా..? కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నది. ఇదంతా అభివృద్ధి కాదా..? ఇదంతా ఎవరి కోసం జరిగింది. ఎంత రిలీఫ్ వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. ప్రజల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పు కోసం తీసుకువచ్చినం.
గత ఎంపీ ఎన్నికల్లో గోల్మాల్ చేస్తే ఇప్పుడు అరిగోస పడుతున్నరు. వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎట్లుండె..? ఇప్పుడు ఎంపీ ఉన్న సమయంలో పరిస్థితులు ఎట్లున్నయ్? వినోద్ ఉన్నప్పుడు కరీంనగర్ టౌన్కు సంబంధించి స్మార్ట్ సిటీ సాధించిండు. ఇప్పుడు స్మార్ట్ లేదు. ప్రజలకు చేసిందేమీ లేదు. ఏమైనా అంటే గుళ్లు తవ్వుదామా..? మసీదులు తవ్వుదామా..? అంటున్నరు. మసీదులు తవ్వేటోడు సిపాయా ఈ దేశంలో..? ఎవడైనా మసీదులు తవ్వుతడా..? సంస్కారం ఉన్న పనులేనా? ఏదో మతం పేరు చెప్పి గోల్ మాల్ చేసి కొట్లాటలు పెట్టడమేనా వీళ్ల పని.
నిజానికి దేశానికి ఏం కావాలి? పేదలు, అణగారిన వర్గాలు, విభిన్న కులాలకు చెందిన వారి బాధలు తొలగించడానికి ఎలా ప్రయత్నాలు చేయాలో ఆలోచించాలి. అటువంటివి ఆలోచించడం లేదు. కానీ, తెలంగాణలో 1019 రెసిడెన్షియల్ స్కూళ్లను అన్ని వర్గాలకు సంబంధించి పెట్టుకున్నం. 119 ఓసీలకు పెట్టబోతున్నం. మనం ప్రగతి కోరుకుంటే.. పొద్దాక కొంతమంది కులం, మతం పేరిట తాకులాటలు పెట్టి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నరు. అన్నివర్గాల ప్రజలు కుల మతాల బేధం లేకుండా మంచిగా బతకాలన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి మనవాడే. ప్రజలు ఈ విషయంలో బాగా ఆలోచించాలి.
ఎన్నికల సమయంలో విపక్షాలు చేస్తున్న తప్పుడు మాటలను విని తెలంగాణను ఆగం చేసుకోవద్దు. గులాబీ జెండా పార్టీ పెట్టి తెలంగాణ తెస్తామని చెప్పాం. తెచ్చి చూపించాం. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పాం. ఇచ్చి చూపించాం. గోదావరి, కృష్ణా జలాలతో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పాం. చేసి చూపించాం. ఎండకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దూకుతున్నయ్. సంక్షేమ పథకాలతోపాటు వచ్చే వందేళ్ల వరకు ఈ రాష్ట్రం ఎలా ఉండాలన్న విషయంలో అభివృద్ధికి పునాదులు వేసిన వ్యక్తి కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం, ప్రజల సంక్షేమం పట్ల ఎక్కడా ప్రేమ లేదు. వాటి నాయకత్వానికి కూడా లేదు. వారు ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతుల్లోకి పోతే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. మళ్లీ బీఆర్ఎస్ జెండా బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. కరీంనగర్లోనూ గంగుల కమలాకర్ మంచి మెజార్టీతో గెలుస్తారు.
– కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్