చొప్పదండి, ఫిబ్రవరి 11: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండానే ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక నియోజకవర్గం కూడా అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ దొంగ హామీలను ప్రజల్లో ఎండగట్టేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. చొప్పదండిలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్హాల్లో మంగళవారం మండలంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. రేవంత్రెడ్డి మోసపూరిత హామీలతో గద్దెనెక్కారని, ఆయన పదిహేను నెలల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గ్రామాల్లో ఎవరిని కదిలించినా తిడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, అది కేసీఆర్తోనే సాధ్యమైందని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గడపగడపకూ వివరించాలని, కాంగ్రెస్ అబద్ధపు హామీలను ఎండగట్టాలని శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అవకాశం రాలేదని ఎవరూ బాధపడొద్దని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికలు ఉన్నందున అవకాశాలు అందరికీ వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఆర్నకొండ సింగిల్విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆరెల్లి చంద్ర శేఖర్గౌడ్, గడ్డం చుక్కారెడ్డి, మాజీ వైస్ చైర్మన్లు కొత్త గంగారెడ్డి, చీకట్ల రాజశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యాక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, బందారపు అజేయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.