రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ‘సిరిసిల్ల నేతన్నలు అధైర్య పడకండి. మీకు అండగా నేనున్నా. మీ బాధలు తీర్చే వరకు అండగా ఉంటా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఈ నెల 6న శనివారం నిర్వహిస్తున్న నేతన్న గర్జన సభకు మద్దతు ఇస్తామని, సభలో బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని చెప్పారు. నేతన్న గర్జన సభతో ప్రభుత్వం దిగిరాకుంటే హైకోర్టులో దావా వేసి, ప్రతి ఊరిలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. చేనేత కార్మికులున్న చోట ఆందోళనలు చేపట్టి రాష్ట్రమంతా రణరంగం చేసి, ఫుట్బాల్ ఆడుతామని స్పష్టం చేశారు.
అడ్వొకేటుగా మీరే కోర్టులో నేతన్నల పక్షాన కేసు వేయాలని పక్కనే ఉన్న బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్కుమార్ను ఆదేశించారు. వకీలు ఫీజులు పార్టీ భరిస్తుందని, భయపడేదేమీ లేదన్నారు. కోర్టుకు గుంజుదామని, కొట్లాడుదామని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన పంటల పరిశీలన అనంతరం, సిరిసిల్ల తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులతో కాసేపు ముచ్చటించారు.
తర్వాత సిరిసిల్ల నేతన్నల సమస్యలపై వస్త్ర ఉత్పత్తిదారులు, యజమానులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై, మాట్లాడారు. ‘సిరిసిల్లలో నేత కార్మికులు సచ్చిపోయే పరిస్థితి ఉందని, ఆత్మహత్యలు మళ్లీ మొదలవుతాయని అడిగితే.. కాంగ్రెసోడు ఇచ్చిన సమాధానం ఏంటి? ఏం పోయింది. నిరోధ్లు, పాపుడాలు అమ్ముకుని బతుకమంటడు. మీరు మనుషులేనా..? లక్షలాదిగా ఉన్న చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా?” అంటూ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘మీరు ఇస్తే ఇవ్వండి.
చేతకాక పోతే ఇవ్వకండి. కానీ, ఇలా మాట్లాడితే చేనేత కార్మికులే పులులై గర్జించి మిమ్మల్ని తరిమికొడుతరు’ అంటూ కాంగ్రెస్ నేతల్ని హెచ్చరించారు. వెంటనే బతుకమ్మ చీరెలు, స్కూల్ యూనిఫాంలు, ఏమున్నా బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమకు రావాల్సిన పెండింగ్ బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసి ప్రభుత్వం సంగతి తేలుస్తానని వస్త్ర యజమానులకు ధైర్యం చెప్పారు.