జమ్మికుంట/ మానకొండూర్ రూరల్, మే8: ‘పేదల దేవుడు రాజన్న అంటే ప్రధాని మోడీకి అంత చిన్నచూపెందుకు? మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన పుణ్యక్షేత్రానికి వచ్చి రాజన్న గుడి అభివృద్ధిపై ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం ఒక్క హామీ ఇవ్వలేదు. కాశీకి వేల కోట్లిచ్చి అభివృద్ధి చేస్తున్న ఆయన, వేములవాడకు ఒక్క రూపాయి ఇవ్వడా..?’ అని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. ఇంతటి పుణ్య క్షేత్రంలో సభ ఏర్పాటు చేస్తే పక్కనే ఉన్న బండి సంజయ్ దీనిపై ప్రధానిని ఎందుకు అడుగలేకపోయారని ప్రశ్నించారు. వాళ్లకు దేవుళ్ల పేరిట రాజకీయం చేసుడు తప్ప, అభివృద్ధి మీద ధ్యాస లేదని విమర్శించారు. అలాంటి అభ్యర్థికి మనం ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలంతా ఆలోచన చేయాలని కోరారు. అభివృద్ధి కోసం పాటుపడే గులాబీ పార్టీ అభ్యర్థులకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం మానకొండూర్, శంకరపట్నం, జమ్మికుంటలో ఎమ్మెల్సీ ఎల్మ్రణ, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సీనియర్ నాయకుడు గడ్డం నాగరాజుతో కలిసి రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల వినోద్కుమార్ మాట్లాడారు. ప్రధాని మోడీ వేములవాడకు వచ్చినా రాజన్న గుడికి నిధులు, ఇతర సమస్యల గురించి ఒక్క మాట అడుగలేని బండి.. ఎంపీగా ఉండడం ఎందుకు అని ప్రశ్నించారు.
కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా గురించి ఎందుకు అడుగలేదో..? వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రాదనే అసహనంతోనే మోడీ నిరాశకు గురవుతున్నారని, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆనాడు తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం ప్రభుత్వ ప్రసాద్ పథకంలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను చేర్చి అభివృద్ధి చేయాలని కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ, బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చేసుకున్నామని, 32 ఎకరాల వేములవాడ గుడి చెరువులో మట్టి నింపి అభివృద్ధి చేసుకున్నట్లు వివరించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తానొక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో..? దేవుడిపేరుతో రాజకీయాలు చేసే బండి కావాలో..? ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్లలో బండి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పైసా కూడా తీసుకురాని అభ్యర్థి మనకెందుకని ప్రశ్నించారు. కాగా, జమ్మికుంట రోడ్షోలో సెల్ఫోన్లోని ఫ్లాష్లైట్లతో వినోదన్నకు మద్దతు తెలుపాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరగా, హాజరైన ప్రజలందరూ ఫ్లాష్లైట్లతో మద్దతు పలికారు. అనంతరం ‘దేశ్ లేంగే ..’ సాంగ్కు ఎమ్మెల్యేతో పాటూ అందరూ నృత్యం చేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ నారదాసు, జడ్పీ అధ్యక్షురాలు విజయ, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, బీఆర్ఎస్ అర్బన్ శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్, మానకొండూర్ రోడ్షోలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూర్ సోసైటీ చైర్మన్ నల్ల గోవింద రెడ్డి, ఊటూర్ సోసైటీ చైర్మన్ ముద్దసాని ప్రదీప్ రెడ్డి, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు బొంగోని రేణుక తదితరులు ఉన్నారు.
అభివృద్ధా..? విధ్వంసమా? ప్రజలే ఆలోచించాలి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు తెస్తమంటే ప్రజలు నమ్మి మోసపోయిన్రు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నది. ఇది ప్రజలందరికీ అర్థమైంది. ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నరు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాస్తున్నది. కాంగ్రెస్, బీజేపీది విధ్వంసం. బీఆర్ఎస్ది ప్రగతి పథం. అభివృద్ధి కావాలా..? విధ్వంసం కావాలా..? ప్రజలే ఆలోచించాలే. ప్రజల బాగుకోరే గులాబీకే పట్టంకట్టాలి. నేను రెండుసార్లు ఎంపీగా పనిచేసిన. మొదటి సారిగా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చినం. రెండో సారి రూ.వెయ్యి కోట్లతో కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన. ఈ సారి నన్ను గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దుతా. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్త. రాబోయే రోజుల్లో ఎంపీగా ఎమ్మెల్యే కౌశిక్రెడ్డితో కలిసి సింగాపూర్ వెళ్లి అధ్యయనం చేస్తం.
యాభై వేల మెజార్టీ ఇద్దాం
ఆరు గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్కు గుణపాఠం చెబు దాం. సంక్షేమం.. అభివృద్ధి ఉద్యమంలా పనిచేసే బీఆర్ఎస్నే గెలిపించుకుందాం. భాష రాని ఎంపీ మనకెందుకు?, పార్లమెంట్లో గళమెత్తే వినోదన్నను 50వేల మెజార్టీతో గెలిపించుకొని కేసీఆర్కు బహుమతిగా అందిద్దాం. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి చేతిలో మరోసారి మోసపోవద్దు.
– పాడి కౌశిక్రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
వినోద్ గెలుపు మన బాధ్యత
తెలంగాణ పొలిటికల్ ఐకాన్ వినోద్కుమార్. ఆయనను మరోసారి ఎంపీగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక అయిన వినోద్కుమార్తోనే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. రేవంత్రెడ్డి మెడలు వంచాలంటే బీఆర్ఎస్నే గెలిపించాలి.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ