ఇల్లందకుంట/ కమలాపూర్, నవంబర్ 14 : ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన ముందుగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్పల్లి, పంగిడిపల్లి, సాయంత్రం ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లి, సీతంపేట, బుజూనూర్, వంతడుపుల గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామాల్లోని మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ 24 గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? 3 గంటలు చాలంటున్న కాంగ్రెస్ కావాలా..? ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నియోజకవర్గ ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి కాపాడుకుంటే, నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని చెప్పారు. తన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే తట్టుకోలేని కొంత మంది తనపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడుసార్లు ఈటల రాజేందర్ను గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇక్కడి ప్రజల మొఖం చూడలేదన్నారు. ఈసారి తనకు అవకాశం ఇచ్చి మరింత సేవచేసే భాగ్యం కల్పించాలని కోరారు. ఇక్కడ గ్రామ సర్పంచులు సరోజన నాగయ్య, వెంకటస్వామి, అరుణ సదానందం, దిలీప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ గణపతి, ఎంపీపీ పావని వెంకటేశ్, ఎంపీటీసీ ఓదెలు, మాజీ వైస్ ఎంపీపీ చుక్క రజింత్, మాజీ సర్పంచులు కుమారస్వామి, సంపత్, ఉప సర్పంచ్ చుక్క రవి, బీఆర్ఎస్ నాయకులు రహీం, రాజిరెడ్డి, సంపత్రెడ్డి, తిరుపతిరెడ్డి, సమ్మిరెడ్డి, రాజయ్య, రవీందర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు ఓటేయండి
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాంటప్పుడు ఇక్కడ వేరే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఎలాంటి అభివృద్ధీ జరగదు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్కు ఓటేసి నా భర్తను గెలిపించండి. ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేలా చూస్తా.
– శాలినిరెడ్డి, కౌశిక్రెడ్డి సతీమణి