జగిత్యాల, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)/వేములవాడ/కథలాపూర్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం వేములవాడ అభ్యర్థి చల్మెడకు మద్దతుగా నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయాచోట్ల ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కథలాపూర్లో , చందుర్తిలో నిర్వహించిన ప్రజాశీర్వాద యాత్రలకు వేలాదిగా తరలిరాగా, రుద్రంగి, కోనరావుపేట, వేములవాడలో రోడ్ షోలకు తండోపతండాలుగా తరలివచ్చి అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ముందుగా కథలాపూర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించగా, కథలాపూర్, మేడిపల్లి, బీమారం మండలాల నుంచి తరలివచ్చారు. ఉదయం 11 గంటలకు అనుకున్న సభ గంటన్నరకుపైనే ఆలస్యంగా ప్రారంభమైనా.. అప్పటికే పోటెత్తారు. 11.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు కాగా, వేదిక కింద మహిళలు ఉత్సాహం ఊగిపోయారు.
‘గులాబీలా జెండలే రామక్క’ పాటపై గులాబీ జెండాలు ఊపుతూ డ్యాన్స్ చేశారు. 12 గంటల సమయంలో వేదికపైకి చేరుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం మహిళలు, యువతీ యువకుల కేరింతలు చూసి స్టెప్పులు వేశారు. జడ్పీ చైర్పర్సన్ వొద్దినేని హరి చరణ్రావు, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోకబాపురెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య తదితరులు సైతం కండువాలు ఊపుతూ చిందేశారు. 12.45 గంటలకు మంత్రి కేటీఆర్ సభా స్థలికి చేరుకోగానే, ప్రజలు హర్షధ్వనులతో స్వాగతం పలికారు. మంత్రి కేటీఆర్ సైతం వేదికపై అభివాదం చేశారు. సభలో మొదట అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, తర్వాత జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రసంగించారు. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు అమాత్యుడు తన ప్రసంగాన్ని ప్రారంభించి, 26 నిమిషాల పాటు ఉర్రూతలూగించారు.
గంగిరెద్దుల వేషగాళ్లు అన్న పదంతో ప్రారంభమైన కేటీఆర్ పడికట్టు పదాల ప్రయోగం చాలా సేపు కొనసాగింది. పగటి వేషగాళ్లు.. షేర్లు.. షేర్ఖాన్లు.. బబ్బర్షేర్లు.. తీస్మార్ఖాన్లు.. అంటూ స్థానిక భాషను, కన్నతల్లికి అన్నం పెట్టనోడు అంటూ సామెతలు.. తేలు పడితే.. మొగమనిషి కోసం భర్త బయటకు పరుగుదీశాడు అన్న పిట్టకథ.. మీకు నేను ఉన్నాను.. ఉంటాను అన్న భరోసా.. ఇలా అనేక విధాలుగా అద్భుతంగా కేటీఆర్ ప్రసంగం కొనసాగింది. కేటీఆర్ ప్రసంగం ప్రభావం సభికులపై, ప్రజలపై స్పష్టంగా కనిపించింది. సభ ముగిసిన అనంతరం సైతం చాలా మంది వ్యక్తులు కేటీఆర్ ప్రసంగంలోని ప్రధాన అంశాలపైనే చర్చిస్తూ ఉండడం కనిపించింది. సభ పూర్తిగా విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ఆనందోత్సాహాల్లో తేలియాడారు. అలాగే చందుర్తిలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభకు మండలంలోని ఆయా గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం 2:30 గంటలకు సభా వేదికపైకి మంత్రి కేటీఆర్రాగా, జై కొట్టారు. ఈ సందర్భంగా అమాత్యుడు ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతూనే, బీఆర్ఎస్కు ఓటేస్తే కలిగే ప్రయోజనాలపై వివరించారు.
కేసీఆర్ సీఎం కాకముందు వేములవాడలో ఎట్లుండె? ఇప్పడెట్లయింది? ప్రజలు గమనించాలి. మేము రాము బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితులుపోయేలా తిప్పాపూర్లో వంద పడకల దవాఖానను ఏర్పాటు చేసినం. పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చినం. గోదావరి జలాలను వేములవాడ గుడి చెరువులోకి తీసుకొచ్చినం. వేములవాడ పట్టణం అభివృద్ధి మా బాధ్యత. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావడంతో పుట్లకు పుట్లు వండ్లు పండుతున్నయి.
– వేములవాడ రోడ్షోలో మంత్రి కేటీఆర్
బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో రెండేళ్లు కరోనా వచ్చింది. ఇంకో ఏడాది ఎన్నికలకే పోయింది. నిజంగా పనిచేసింది ఆరున్నర ఏండ్లే. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇప్పుడు ఊళ్లకు వస్తున్నరు. ఇన్ని దినాలు లేని ప్రేమను ఇప్పుడు చూపుతున్నరు. ఈ వ్యక్తుల మధ్య ఎన్నికలు ఉండవు. పార్టీల మధ్యలో జరుగుతున్నయి. ఏ పార్టీ మీకు ఏం చేసిందో గుర్తించాలి. కాంగ్రెస్ను గెలిపించుకొని మనం కష్టపడుదామా..? తెలంగాణను గెలిపించి మనం అభివృద్ధి చేసుకుందామా..? ప్రజలు ఆలోచించాలి.
– మంత్రి కేటీఆర్
కథలాపూర్ ప్రజా ఆశీర్వాద సభ అనంతరం మంత్రి కేటీఆర్ పెద్ద సంఖ్యలో నాయకులతో కలిసి రుద్రంగికి రోడ్షో వెళ్లారు. ఆ తర్వాత 2:30 గంటలకు చందుర్తిలో నిర్వహించిన అక్కడ ప్రజాశీర్వాద సభలో పాల్గొని, కోనరావుపేట రోడ్షో, వేములవాడ రోడ్, తంగళ్లపల్లి రోడ్షోల్లో పాల్గొన్నారు. ఆయా చోట్ల అమాత్యుడికి ఘన స్వాగతం పలికారు. ప్రజలు వేలాదిగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈలలు, కేకలతో జేజేలు పలికారు. ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ ‘చప్పట్లు కొట్టాలి’ ‘పిడికిలెత్తాలి’ అనే పిలుపునకు పెద్ద ఎత్తున స్పందించారు. ‘కేటీఆర్’ ‘జై జైకేటీఆర్’ అంటూ నినందించారు. కథలాపూర్ నుంచి తంగళ్లపల్లి దాకా మంత్రి కాన్వాయ్ వెంట వందలాది బైక్లో ర్యాలీ తీశారు. కాగా, వేములవాడ రాజన్న ఆలయం ఎదుట నిర్వహించిన రోడ్షోకు ప్రజలు తండోపతండాలుగా.. దాదాపు 10వేల మంది వచ్చారు.
మీ ముందు మల్కపేట రిజర్వాయర్ ఉన్నది. ఇప్పటికే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అందులో ఒక టీఎంసీ నీటిని నింపినం. అక్కడి నుంచి ఎగువప్రాంతాలైన నిమ్మపల్లి, మర్రిమడ్ల నీటిని లిఫ్ట్ ద్వారా అందించబోతున్నం. ఆరుగుట్టల నడుమ, ఏడు కట్టలతో నిర్మించిన ఈ రిజర్వాయర్ను ప్రతి ఆడబిడ్డకూ నాయకులు చూపించాలి. తీసుకొచ్చినం. కాళేశ్వర జలాలను ఏ విధంగా తీసుకొచ్చామో వివరించాలి. అప్పుడు ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందిందో వాళ్లకు కూడా తెలుస్తుంది. నేను చందుర్తి నుంచి వస్తుండగా, రోడ్ల వెంట కుప్పులు తెప్పలుగా వడ్ల రాశులు కనిపిస్తున్నయి. సంతోషంగా ఉన్నది. చందుర్తికి కూడాగోదావరి జలాలు తెచ్చినం. యాభై వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చినం. ఇవాళ మనం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం.
– మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ అరవై ఏండ్ల పాలనలో మనిషి చనిపోతే స్నానాలు చేసేందుకు కరెంటు, నీళ్లు దిక్కులేవు. అలాంటోళ్లను గెలిపిస్తే కారుచీకట్లే కమ్ముకుంటయి. కాలిన మోటర్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఎండిన చెరువులు, కుంటలు దర్శనమిస్తయి. 10 హెచ్పీ మోటర్ వ్యవసాయానికి ఉంటుందా..? ఆ మాత్రం కూడా తెలువని ఎడ్డోడు రేవంత్రెడ్డి. మూడు గంటల కరెంటు చాలు అంటుండు. అలాంటోడికి ఓటేస్తే కటిక దరిద్రాన్ని కొనితెచ్చుకున్నట్లే. అందుకే ప్రజలు ఆలోచించి ఓటేయాలి. 24గంటలు కరెంట్ కావాలో..? 3 గంటలు కరెంట్ కావాలో.. తేల్చుకోవాలి.
– మంత్రి కేటీఆర్