బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజా ఆకాంక్షలకు అద్దం పట్టింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక, సకల జనం మెచ్చేలా ఉన్నది. ఎప్పటిలాగే అధినేత తన మానవీయతను మరోసారి బయట పెట్టగా, పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం ప్రస్ఫుటమైంది. దళితబంధు, గృహలక్ష్మి యథావిధిగా అమలు చేయడం, రైతుబీమా తరహాలో బీపీఎల్ కుటుంబాలకు ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా’, ఆరోగ్యశ్రీ పరిమితి, వృద్ధులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్ల పెంపు, పేద మహిళలకు జీవనభృతి, 400కే సిలిండర్, రేషన్కార్డుదారులకు సన్నబియ్యం, రైతుబంధు కింద పెట్టుబడి సాయం పెంపు, అగ్రవర్ణాల్లో పేదల కోసం గురుకులాలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలుపై అధ్యయన కమిటీలు ఇలా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
– కరీంనగర్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో పేదల పక్షపాతిగా కనిపిస్తోంది. మానవీయ కోణంలో ఆలోచన చేసిన బీఆర్ఎస్ అధినేత అడుగడుగునా వారి సంక్షేమాన్ని గుర్తు చేసేలా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వని అనేక అంశాలను రాష్ట్ర ప్రజల కోసం అమలు చేసింది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను గడచిన రెండు ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పలేదు. కానీ, ఇలాంటి మానవీయ పథకాలను సమయానుకూలంగా ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేసిన సమయంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాగే, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అవసరమైన పథకాలను సమయానుకూలంగా ప్రవేశ పెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎన్నో పథకాలను దేశంలోని అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి.
ఇలాంటి పథకాలను తిరిగి కొనసాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే, రైతుబంధు పథకానికి ఇప్పుడు ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండగా, తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.16 వేలకు పెంచుతున్నట్లు, వచ్చే ఏడాదిలో రూ.12 వేలు ఇచ్చి, ప్రతి ఏటా పెంచుతూ ఐదేళ్లలో రూ.16 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.. ఆసరా పెన్షన్లు కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆసరా పింఛన్లు ఇప్పుడు రూ.2,016 ఇస్తుండగా దానిని రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేలకు పెంచి ఇస్తామని, ఆ తర్వాత క్రమంగా రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని, వచ్చే మార్చిలో రూ.5 వేలకు పెంచి క్రమంగా రూ.6 వేలు చేస్తామని స్పష్టం చేయడంతో ఆసరా లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద వైద్య సహాయం కోసం రూ.15 లక్షలు అందిస్తామని ప్రకటించడంతో తమ ఆరోగ్యాలకు భరోసా ఏర్పడిందని పేదల్లో చర్చ జరుగుతోంది.
కొత్త పథకాలపై హర్షాతిరేకాలు..
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించిన పలు కొత్త పథకాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 3 వేల భృతి కల్పిస్తామని, అర్హులైన వారందరికి రూ. 400లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని, జర్నలిస్టు కుటుంబాలకు కూడా రూ. 400లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. అంతే కాకుండా, జర్నలిస్టు కుటుంబాలకు ఉద్యోగుల తరహాలోనే హెల్త్ స్కీం అమలు చేస్తామని చెప్పడంతో ఈ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ మరో ముఖ్యమైన పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.
ఈ పథకం ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చే విధంగా ఉంది. ‘కేసీఆర్ బీమా.. ఇంటింటికి ధీమా’ పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం రైతు బీమా తరహాలో కుటుంబంలో పెద్ద చనిపోతే రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. అంతే కాకుండా, పేదల కోసం ప్రతి రేషన్ కార్డుపై సన్న బియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. స్వశక్తి సంఘాలకు భవనాలు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇండ్ల స్థలాలు ఉంటే గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు, లేకుంటే స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. ఇటు ఉద్యోగ వర్గాలను కూడా సంతోష పెట్టే అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. ఉద్యోగులకు పాత పద్ధతిలోనే పెన్షన్ ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అగ్రవర్ణ కులాల పిల్లల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక రెసిడెన్సియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇలా ప్రతి వర్గాన్ని సంతృప్తి పర్చే విధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఉద్యోగుల సమస్యను చేర్చడాన్ని స్వాగతిస్తున్నాం
రెండు దశాబ్దాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుపై అధ్యయన కమిటీ వేసే నిర్ణయాన్ని బీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చడాన్ని స్వాగతిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల కల నెరవేడం ఖాయం. ఓపీఎస్ విధానం అమలైతే ఉద్యోగ, ఉపాధ్యాయుల బాధలన్నీ తీరుతాయి. వాస్తవంగా దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇప్పటికే సీపీఎస్ రైద్దెంది. దీని అమలు మూలంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగి మూలవేతనం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పది శాతం మొత్తం పీఎఫ్ఆర్డీఏ ఫండ్కు జమవుతున్నది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్లో డిపాజిట్ చేస్తుండగా, ఉద్యోగి పదవీ విరమణ సమయానికి షేర్ మార్కెట్ కుప్పకూలితే ఉద్యోగుల పరిస్థితి కడుదయనీంగా మారుతుంది. 2004 నుంచి వసూలు చేస్తున్న మొత్తంలో నుంచి పది శాతం జీపీఎఫ్ ఖాతాకు, మిగతా పదిశాతం రెగ్యులర్ పెన్షన్ వర్తింపజేసే పెన్షన్ ఖాతాకు బదిలీ చేయాలి.
– చందూరి రాజిరెడ్డి, టీఎస్టియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కలెక్టరేట్)
ఉద్యోగులందరికీ సమన్యాయం
ఉద్యోగులకు పాత పద్ధతిలో పింఛన్ వర్తింపజేయడంపై అధ్యయనం చేసేందుకు నూతనంగా కమిటీ వేస్తామని మేనిఫెస్టోలో చేర్చడం చాలా సంతోషదాయకం. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పాత పెన్షన్ వర్తింపజేయడం కొంత ఆలస్యమైనా అందరికీ సమ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. కేసీఆర్ న్యాయబద్ధంగా వ్యవహరించినందుకు ఉద్యోగుల బాధలను గుర్తించి కమిటీ వేయడం హర్షదాయకం.
– భారత ప్రభాకర్, తెలంగాణ పీఆర్టీయూ మండలాధ్యక్షుడు (హుజూరాబాద్టౌన్)
ఆరోగ్యానికి ధీమా ఇచ్చిన్రు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది పేదలు లబ్ధి పొందుతున్నరు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల లిమిట్ ఉండగా, రూ.15 లక్షలు పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టడంతో ఎంతోమంది పేదలకు భరోసా ఉంటది. సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ లిమిట్ పెంచుతామని ప్రకటించడం హర్షనీయం. రూ.15 లక్షలతో ఎంతటి ఆరోగ్య సమస్యలైనా వైద్యం చేయించుకోవచ్చు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లిమిట్ సరిపోక.. ఎంతోమంది ఇబ్బందులు పడ్డరు. ఇప్పుడు పెంచుతామని చెప్పడంతో భరోసా ఉంటది.
– తూముల శ్రీలత, మక్తపల్లి (తిమ్మాపూర్)
మళ్లీ సారే వస్తడు..
దివ్యాంగులు అంటే గత ప్రభుత్వాలకు చిన్న చూపు ఉండేది. పింఛన్ కూడా అరకొరగా ఇచ్చేది. సీఎం కేసీఆర్ వచ్చాకే మాకు ఆత్మగౌరవం పెరిగింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్ ఇస్తున్నరు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే మాకు రూ.6 వేల వరకు ఇస్తామనడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఒక భరోసా కలుగుతుంది. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా మాకు ఆత్మ గౌరవంగా బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. ఇవాల్టి మేనిఫెస్టో టీవీలో చూసిన. అన్ని వర్గాల అభివృద్ధికి సారు మేనిఫెస్టో తయారు చేసిన్రు. ఇప్పుడు పెరిగే పెన్షన్ మా ఖర్చులకు ఇంకా ఉపయోగపడతయ్. మళ్లీ సారే వస్తడు. అనుమానం లేదు.
– ఎల్లాల స్వామిరెడ్డి, దివ్యాంగుడు, పారువెల్ల, గన్నేరువరం
ఓపీఎస్పై కమిటీ ఆహ్వానించదగ్గ నిర్ణయం
పాత పెన్షన్ విధానం అమలుపై అధ్యయన కమిటీ వేసే నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపర్చడం ఆహ్వానించదగ్గ పరిణామం. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంతో రెండు దశాబ్దాల కాలం నుంచి లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్న క్రమంలో కొద్ది నెలలుగా సీఎం కేసీఆర్ నిశీతంగా పరిశీలించి మేనిఫెస్టోలో చేర్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని భావిస్తున్నాం. ఇన్నాళ్ళుగా ఉద్యోగులు విధి నిర్వహణ సక్రమంగా చేయలేక పోయిన ఉద్యోగులు, ఇకనుంచి నిబద్ధత కనబరిచే అవకాశాలుంటాయి. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలతో చేసి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళే వారిలో ముఖ్యభూమిక పోషించేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా బీఆర్ఎస్ కృషి చేస్తున్న క్రమంలో ఉద్యోగులంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– సముద్రాల జనార్దన్రావు, వ్యవసాయ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్(కలెక్టరేట్)
ఇంలిల్లిపాదికీ ఆరోగ్య భద్రత
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.15 లక్షలకు పెంచుతామని పేర్కొనడం సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూరేలా ఉన్నది. ఇంటిల్లిపాదికి ఆరోగ్య భద్రత కలుగుతుంది. నిజానికి నేను ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందినవాడిని. గతంలో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. పార్టీలకతీతంగా అమలవుతున్న ఈ పథకంతో ప్రజలు ప్రాణాలను కాపాడుకున్నారు. గత పదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నది. ఏ ప్రభుత్వమైనా తమ ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పథకాలను అందించడం ద్వారా, ఆ ప్రభుత్వం పదికాలాలపాటు మనుగడ కొనసాగుతుంది. మంచి మంచి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ప్రజలకు సేవలు అందించే బీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
– కాసారపు బుచ్చిరాములుగౌడ్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు, గోపాల్రావుపేట (రామడుగు)