గంగాధర, నవంబర్ 6: ‘తెలంగాణను అభివృద్ధి చేసే కేసీఆర్ కావాలా..? అబద్ధాల కాంగ్రెస్ కావాలా..? కాంగ్రెస్ వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతది. ప్రజలు ఆలోచించి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలి’ అని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజల అభీష్టం మేరకు గర్శకుర్తి మండల ఆకాంక్షను నెరవేర్చుతామని, కొన్ని సాంకేతిక సమస్యలతో మండలం ఏర్పాటు ఆలస్యమైందని వివరించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందించే బతుకమ్మ చీరల తయారీకి జనవరి నెలలోనే ఆర్డర్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. మండలంలోని గర్శకుర్తి గ్రామంలో చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు మంగళహారతులో స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు.
ఈ సందర్బంగా వినోద్కుమార్ మాట్లాడారు. తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అప్పటి పాలకులు ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. దమ్ముంటే ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి కరెంట్ తీగలపై బట్టలు ఆరేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యాభివృద్ధికి వెయ్యి గురుకులాలు, 33 జిల్లాలో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డబ్భు ఏండ్లల్లో వైద్య విద్యలో ఎన్నడూ, ఎకడా జరగని అద్భుతాన్ని తెలంగాణలో పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించిందన్నారు. రైతుబీమా మాదిరిగా ప్రతి కుటుంబానికి ధీమా పేరుతో రూ.5 లక్షల బీమా వర్తించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. ప్రజా సంక్షేమ పార్టీ బీఆర్ఎస్ అయితే, స్కాముల పార్టీ కాంగ్రెస్ అని, మత రాజకీయాల పార్టీ బీజేపీ అని ఏదీ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని అభ్యర్థించారు. నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి రైతు రాజ్యానికి జై కొట్టాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్రెడ్డి తెలంగాణలో రైతులకు మూడు గంటల కరెంటు చాలని, ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు వద్దు అంటూ వ్యవసాయాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు ఓటేస్తే కర్ణాటక పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.
ఎన్నికలప్పుడూ వచ్చే నాయకులను నమ్మవద్దని, నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అభివృద్ధి చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో రాష్ట్ర నాయకుడు కొత్త జైపాల్రెడ్డి, ఎంపీపీ శ్రీరాం మధుకర్, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్రావు, దూలం బాలగౌడ్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సర్పంచులు అలువాల నాగలక్ష్మీతిరుపతి, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, ఎండీ నజీర్, ఎంపీటీసీలు తడిగొప్పుల రజితారమేశ్, కోలపురం లక్ష్మణ్, అట్ల రాజిరెడ్డి, నాయకులు ఆకుల మధుసూదన్, అట్ల శేఖర్రెడ్డి, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, మామిడిపెల్లి అఖిల్, దూస అనిల్ కొమురయ్య, మహేందర్, పల్ల మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.