మానకొండూర్ రూరల్, నవంబర్ 14 : “కాంగ్రెస్ పార్టీ మానకొండూర్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ నోరు జారుతున్నారు. కొంచెం అదుపులో పెట్టుకోవాలి. రాజకీయాలే జీవితం కాదు జీవితమే రాజకీయం కాదు..” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హితవుపలికారు. మానకొండూర్ నియోజక వర్గం నుంచి రసమయి బాలకిషన్ మరోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుస్తాడని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం మానకొండూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో ఇటీవలే చేరిన దరువు ఎల్లన్న, గడ్డం నాగరాజుకు ధన్యవాదాలు తెలిపారు. వారి సేవలను పార్టీకి, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ గెలుపు కోసం వినియోగించుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ ప్రజల నుంచి ఆదరణ భారీగా పెరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ చేతిలోకి తెలంగాణ రాష్ట్రం పోతే కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ బావుల వద్ద 10 హెచ్పీ మోటర్లు ఉంటాయా?, వ్యవసాయానికి ఏ మోటర్లు పెడుతారో తెలియని రేవంత్రెడ్డికి సామాజిక పరిస్థితి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే పొలాల వద్దకు వెళ్లేందుకు టార్చిలైట్ పట్టుకొని వెళ్లే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. దాదాపు 60 ఏండ్ల కాంగ్రెస్ హయాంలో ఒక్క ఎస్సారెస్పీ కడితే, తెలంగాణ వచ్చినంక 20 రిజర్వాయర్లు కట్టామని గుర్తు చేశారు. 35 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, 500 పడకల దవాఖానలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ లాంటి మహమ్మారి వస్తే కూడా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా అధునాతన పద్ధతిలో, మంచి నిష్ణాతులైన వైద్యులు, స్టాఫ్, సిబ్బంది ఉండేలా దవాఖానలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణాలో ఇప్పటి యువతకు కర్ఫ్యూ అనే పదమే తెలియదన్నారు. తెలంగాణ అంటేనే పచ్చదనమని, ఆర్థికంగా ఎదిగామని, ఇంకా చేయాల్సింది బాగా ఉందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి విద్యను అభివృద్ధి చేస్తున్నామని, అందులో భా గంగానే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ను అందిస్తున్నామని, త్వరలో అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్సియల్గా మార్చుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు పడాల శంకరయ్య ఉన్నారు.