కార్పొరేషన్, మార్చి 14 : సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న దళిత నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివక్ష చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ధర్మపురి నియోజకవర్గ నాయకుడు కన్నం అంజయ్య ఫైర్ అయ్యారు. సంజయ్ తీరును సహించేది లేదని, త్వరలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, రెండుసార్లు ధర్మపురి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశానని, చనిపోయే దాకా బీజేపీలోనే ఉంటానని, దళితులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఏళ్ల తరబడిగా పార్టీ కోసం పని చేసి వివక్షకు గురవుతున్న సీనియర్లందరితో కలిసి ఈ నెలాఖరులోగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తాము ఏమిటో చూపిస్తామన్నారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తారక హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వేదికగా ఆయన, బండి సంజయ్ తీరుపై బాహాటంగానే విమర్శించారు. జిల్లా నుంచి ఒక బీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్నాడంటే తాము ఎంతో సంతోషించామని, దళితులకు సముచిత పదవులు ఇస్తారని ఆశించామని, కానీ, ఆశ నిరాశే అయిందన్నారు. సంజయ్ కార్పొరేట్ సంస్థలు, తనకు ఆర్థికంగా సహకరిస్తున్న వారికే పదవులు అప్పగిస్తున్నారని విమర్శించారు. 2009లో కరీంనగర్లో బీసీలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వడం లేదని అప్పటి బీజేపీ నాయకుడు విద్యాసాగర్రావును ప్రశ్నించిన సంజయ్, ఇప్పుడు దళితులకు ఎందుకు పదవులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో తాను వడ్కాపూర్ ఎంపీటీసీగా గెలిచినప్పుడు నక్సలైట్లు ఎంతో బెదిరించినా భయపడకుండా పార్టీ జెండాను పట్టుకొని ముందుకు సాగామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నక్సలైట్ల చేతుల్లో 36 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారని, వారికి సంజయ్ ఏం భరోసా కల్పించారని ప్రశ్నించారు. గతంలో తనకు పదవి ఇవ్వలేదని సంజయ్ రాష్ట్ర పార్టీ కార్యాలయం తలుపులు పగలగొట్టారని, ఇప్పుడు తాము కూడా అదే దారిలో నడువాలా అని ప్రశ్నించారు. నీకు పదవి లేకపోతే ఓ పద్ధతి, మాకు పదవులు అడిగితే మరో పద్ధతా..? అని నిలదీశారు. 2014 ఎన్నికల్లో మాదిగల డిమాండ్ మేరకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీని అమలు చేయించాలని సంజయ్ను డిమాండ్ చేసినందుకే తనపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. తనపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్న సంజయ్, పార్టీ కోసం సర్వం త్యాగం చేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
సిద్ధాంతాలను నమ్ముకొని, ఆర్థికంగా దెబ్బతిని, సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీని కాపాడిన సీనియర్లకు కూడా పదవులు ఇవ్వడం లేదని విమర్శించారు. ఆ పార్టీల నుంచి, ఈ పార్టీల నుంచి వచ్చిన అర్థబలం ఉన్నవారికి, తనకు కోట్లు ఇస్తున్న వారికి పదవులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై అధిష్టానంతోపాటు కోర్ కమిటీకి ఇప్పటికే లేఖల ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం, ప్రభుత్వం దళితులు, గోండులకు ప్రాధాన్యత ఇచ్చి సముచిత పదవులను కట్టబెడుతుంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాత్రం దళితులను రాష్ట్ర పార్టీలో స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న దళిత నాయకులకు ఏం పదవులు ఇచ్చారో కరీంనగర్లోని అంబేద్కర్ చౌరస్తాలోకి వచ్చి చెప్పాలని సంజయ్కు సవాల్ చేశారు. ఎన్ఆర్ఐలు, కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు టికెట్లు ఇస్తామంటూ ఇప్పటికే సంజయ్ జోరుగా ప్రచారం చేయించుకుంటున్నారని, తామే టికెట్లు ఇస్తామంటూ సొంత అజెండాతో పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసిన దళిత నేత బంగారు లక్ష్మణ్ జయంతి, వర్ధంతిని చేయలేని సంజయ్, కాంగ్రెస్ నాయకుడైన వెంకటస్వామి జయంతి, వర్ధంతులు, విగ్రహావిష్కరణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్లో తిరిగి బీజేపీలో చేరిన వివేక్ తన సొంత క్యాడర్కు మాత్రమే పదవులు ఇప్పించుకుంటున్నారని, మాదిగలను పూర్తిగా అణిచివేస్తున్నారని విమర్శించారు. దళితులకు న్యాయం చేస్తాడని వివేక్కు పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడిగా అవకాశం ఇస్తే తను మాత్రం సొంత రాజకీయ లబ్ధికోసం, తన క్యాడర్ కోస మే పనిచేస్తున్నారని విమర్శించారు. వివేక్ పార్టీ లో ఏ పద్ధతిలో ఏ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. డబ్బులుంటే సరిపోతుందన్న విధంగా పార్టీని తీసుకుపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఏ మాదిగలకైనా పదవులు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. వివేక్ తనకు డబ్బులు ఉన్నాయన్న అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నల్లారపు నర్సింగ్, గౌరి హన్మండ్లు, సాగర్, కొత్తూరు రాజు తదితరులు పాల్గొన్నారు.