ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు?lప్రైవేటు సంస్థలకు దోచిపెడుతున్నది
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజం
కార్పొరేషన్, ఫిబ్రవరి 3 : దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధిపై ఏ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయలేదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసం ఒక్క పథకాన్నైనా తీసుకొచ్చిందా? అని నిలదీశారు. గురువారం స్థానిక మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు అప్పగిస్తూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్రలు పన్నుతుందని దుయ్యబట్టారు. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితులు, బడుగులను కాల్చివేస్తున్నా పట్టించుకునే పరిస్థితులు లేవన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి మళ్లీ వాటిని వాపసు తీసుకుంటున్నామని ప్రధాని నేరుగా చెప్పిన పరిస్థితి ఉందన్నారు. రైతులకు మేలు చేయకపోగా ఇప్పుడు ఎరువుల సబ్సిడీలోనూ కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ఏకైక పార్టీ బీజేపీనేనని ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మూలంగా కనీసం ఒక్క రంగమైనా లబ్ధి పొందే అవకాశం ఉందా? అని నిలదీశారు. బీజేపీ నాయకులు రాష్ట్రం కోసం ఏం నిధులు తీసుకువచ్చారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పేదలు, బడుగు, బలహీన వర్గాలకు మంచి జరిగే విధంగా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తున్నారని, అంబేదర్ ఆలోచనలకు అనుగుణంగా బడుగులు అభ్యున్నతిలోకి రావాలన్న లక్ష్యంతో పథకాలను తీసుకువస్తున్నారని వివరించారు. కానీ, బీజేపీ దళితులు, బడుగులను ఓట్ల కోసం వాడుకుంటూ ఏ రోజు కూడా వారి అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో ఒక్క పథకం కూడా తీసుకురాలేదన్నారు. కేంద్రం తీరుతో దేశవ్యాప్తంగా రైతులంతా ఆందోళనలో ఉన్నారని, 700 మంది రైతుల ఆత్మఘోష బీజేపీకి తగులుతుందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన మాట ఏమైందని బీజేపీని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలతో టీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు బాలాగౌడ్, తిరుమల్రావు, రామడుగు, చొప్పదండి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జితేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చొప్పదండి ఎంపీపీ చిలుక రవి, టీఆర్ఎస్ నాయకులు వినయ్, చొక్కారెడ్డి పాల్గొన్నారు.