జగిత్యాల, సెప్టెంబర్ 1: సమైక్య పాలనలో వృత్తులు ధ్వంసమై ఆగమైన బలహీన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపేందుకే సర్కారు బీసీ బంధుకు అంకురార్పణ చేసిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే అన్నివర్గాలకు మేలు జరుగుతున్నదని చెప్పారు. శుక్రవారం జగిత్యాల సమీకృత కలెక్టరేట్లో నియోజకవర్గంలోని 98 మంది బీసీ లబ్ధిదారులకు 98 లక్షలు, ఐదుగురు మైనార్టీలకు లక్ష చొప్పున 5లక్షల చెక్కులను ఎమ్మెల్సీ రమణతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
అలాగే జీవో 58లో భాగంగా టీఆర్నగర్కి చెందిన 40 మంది, రూరల్ మండలానికి చెందిన ఎనిమిది మందికి ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కులవృత్తుల బలోపేతానికి సర్కారు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని చెప్పారు. బీసీ బంధు ద్వారా 15 కులాలకు చెందిన వృత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ, నివాస స్థలం లేని వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. చేనేతబంధు ద్వారా రాష్ట్రంలో 22 వేల మగ్గాల కార్మికులకు 3 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా నేడు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎకడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కృషి చేసిన సంజయ్ అభినందనీయుడన్నారు. జిల్లా కేంద్రంలో టీడీఆర్ ద్వారా ఎమ్మెల్యే కృషితో యావర్ రోడ్డు విస్తరణకు మార్గం సుగమమం కావడం సంతోషకరమన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్, జగిత్యాల ఆర్డీవో నర్సింహామూర్తి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సాయిబాబా, మున్సిపల్ కమిషనర్ అనిల్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.