మానకొండూర్ రూరల్, నవంబర్ 25: పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు డాక్టర్ అరవింద్ రెడ్డి, డాక్టర్ సుస్మితారెడ్డి సూచించారు. గురువారం మండలంలోని నిజాయితీగూడెం, గట్టుదుద్దెనపల్లి గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. నిజాయితీగూడెంలో 320 పశువులకు, గట్టుదుద్దెనపల్లిలో 109 పశువులకు మొత్తం 429 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో నిర్వహించే పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది బలరాం, విజయలక్ష్మి, సమతారాణి, అనిత, వినిత్, లచ్చయ్య, రాజయ్య, శ్రీనివాస్, మరియా, పాడి రైతులు పాల్గొన్నారు.
శంకరపట్నం, నవంబర్ 25: మండలంలోని కన్నాపూర్ గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా 434 పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలకు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు మొలంగూర్ పశు వైద్యాధికారి డాక్టర్ మాధవరావు వెల్లడించారు. ఇక్కడ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు ఉన్నారు.
చిగురుమామిడి, నవంబర్ 25: పశు సంపదను కాపాడేందుకే ప్రభుత్వం ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నదని మండల పశువైద్యాధికారులు శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని పీచుపల్లి బరిగెలపల్లి గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పశువులను రోగాల బారి నుంచి కాపాడుకునేందుకు టీకాలు దోహదపడతాయన్నారు. జీవాల పెంపకం దారులు, రైతులు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, గోపాలమిత్ర పాల్గొన్నారు.