పోరాడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చగా, క్షేమంగా ఉండాలంటే కేసీఆర్ చేతుల్లోనే ఉండాలని, అప్పుడే అభివృద్ది కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దొంగలంతా ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారని, రాష్ట్రం వారి చేతుల్లోకి పోకుండా చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం నగరంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం చొప్పదండి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం, వాల్మీకి జయంతి వేడుకలకు హాజరయ్యారు. అనంతరం మానేరు నదిపై చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని పరిశీలించారు. తర్వాత తిరుమల్నగర్ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం, అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్టీసీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు.
– కార్పొరేషన్, అక్టోబర్ 28
కార్పొరేషన్, అక్టోబర్ 28 : తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే క్షేమంగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన స్థానిక శ్రీదేవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్టీసీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై వారినుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిదన్నారు. సాధించుకున్న తెలంగాణను ఇప్పుడు ఆంధ్రా దొంగల, ఢిల్లీ చేతుల్లోకి పోకుండా చూసుకోవాలని సూచించారు. 50 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కరీంనగర్ అభివృద్ధిలో ఎలాంటి మార్పులూ రాలేదన్నారు. నగరమంతా మట్టిరోడ్లు, అడ్డదిడ్డంగా మురికి కాల్వలు ఉండేవన్నారు. 50 ఏళ్ల దరిద్రాన్ని, పదేళ్లల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని కోరారు. సమైక్యాంధ్రలో నగరాభివృద్ధికి రూ.కోటి ఇవ్వాలని అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని కోరితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.
నాడు ఆంధ్రాలో కొబ్బరిచెట్లు దెబ్బతింటే నాయకులంతా కట్టగట్టుకొని పోయి పరిహారం అందించే వారని, కానీ తెలంగాణలో పొలాలు ఎండినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమైక్యాంధ్రలో సాగునీరు, కరెంటు, ఉద్యోగాల కోసం అరిగోసపడ్డామన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని, నగరం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే మొదటిసారి నగరాభివృద్ధి కోసం నిధులు అడిగితే రూ.350 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో సాగుతున్న అభివృద్ధిని చూసి ఆంధ్రా నాయకులకు కళ్లు మండుతున్నాయని విమర్శించారు. అందుకే హైదరాబాద్లో దొంగలంతా చేరారని, కేసీఆర్ ఓడిపోతే హైదరాబాద్ సంపదను దోచుకుని పోదామని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా అభివృద్ధి సాగుతుందని, దీనిపై కళ్లమంట మొదలైందని విమర్శించారు.
రాష్ట్ర ఏర్పాటు సమయంలో సీఎంగా ఉన్న కిరణ్కుమార్రెడ్డి నాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు బీజేపీ ముసుగులో హైదరాబాద్లో అడ్డా వేశారని మండిపడ్డారు. ఆంధ్రాకు చెందిన నాయకులందరూ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారని, కేసీఆర్ ఓడిపోతే ఆంధ్రాలో కలిపేసుకుందామని ఎదురుచూస్తున్నారని ధ్వజమెత్తారు. 56 ఏళ్ల క్రితం మన తాతలు తప్పులు చేస్తే మనం కష్టాలు పడ్డామని, ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ పరిపాలన పోతే 1956లో ఏం చేశారో ఇప్పుడు అదే చేస్తారని విమర్శించారు. హైదరాబాద్లోని సంపదను దోచుకుపోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 50 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు మళ్లీ ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు వేయాలని కోరుతున్నాయని, వారికి ఓటు వేస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ వారిని నమ్మవద్దని తమను మోసం చేశారని చెప్పుతున్నారని మండిపడ్డారు. బస్సులో మహిళలకు ప్రయాణం ఉచితం అన్న కాంగ్రెస్ ఇప్పుడు బస్సులే నడపడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఆచితూచి ఓటు వేయాలని, ఒక్క ఓటు తప్పు చేస్తే 50 ఏళ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. కుక్కలు చింపిన ఇస్తరి చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ను నమ్మితే భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందన్నారు. సమావేశంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఆర్టీసీ సంఘ నాయకులు జక్కుల నాగరాజు, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.