ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు పట్టణ శివారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన భరోసానిస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ధర్మాసుపత్రికి వెళ్లాల్సిన బాధ లేకుండా అక్కడికక్కడే వైద్యం అందేలా నెలకొల్పిన వైద్యశాల విలీన గ్రామాల ప్రజలకు అపర సంజీవనిగా మారుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో గత నెలలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో ఏర్పాటు చేసిన హాస్పిటల్ దిగ్విజయంగా నడుస్తున్నది. రోజుకు 40 మందికి పైనే ఓపీ చూస్తూ.. నిపుణులైన వైద్యులతో సేవలందిస్తుండడంతో రోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 20 : స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ప్రజా వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల ప్రజలకు అక్కడికక్కడే సత్వర వైద్యం అందాలన్న సంకల్పంతో బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన స్థానిక ప్రజలకు అపరసంజీవనిగా మారింది. రూ. 13లక్షల వ్యయంతో నిర్మించిన వైద్యశాలను గత నెల 27న మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, ఆదరణ పెరిగింది. నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం దాకా అందుబాటులో ఉండి వైద్య సేవలందిస్తుండడంతో దూర, వ్యయ భారం తప్పినట్లయింది. మున్సిపల్ విలీన గ్రామాలైన రాజీవ్నగర్, ముష్టిపల్లి, భూపతినగర్, జయప్రకాశ్నగర్, అంబికానగర్, పద్మనగర్, చిన్నబోనాల, పెద్దబోనాల, వెంకంపేట ప్రజలు ఇక్కడికే వస్తూ సేవలు పొందుతున్నారు.
ఓపీ సేవలకు విశేష స్పందన..
బస్తీ దవాఖానలో ప్రస్తుతం ఓపీ విభాగంలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ రమేశ్, స్టాఫ్నర్సు(1), స్వీపర్, ఆయా(1) సిబ్బంది అందుబాటులో ఉన్నారు. టీబీ, ఎన్సీడీడీ, బీపీ, షుగర్, తదితర విభాగాలలో వైద్య సేవలు అందిస్తున్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, హెచ్ఐవీ తదితర వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనతో పాటు ఫ్యామిలీ ప్లానింగ్పై కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గతంలో ఆయా ప్రాంతాల ప్రజలు జిల్లా దవాఖానకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు రూ.50 నుంచి రూ.100 దాకా ఖర్చయ్యేవి. ఈ క్రమంలో ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిన బస్తీ దవాఖానలకు విశేష స్పందన వస్తున్నది. ప్రతి రోజు 30 నుంచి 40మంది రోగులు వైద్య సేవలను వినియోగించుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
సబ్ సెంటర్లకు సపోర్టివ్గా..
జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్, అంబేద్కర్నగర్ పరిధిలో పీహెచ్సీలకు అనుబంధంగా బస్తీ దవాఖాన పనిచేస్తున్నది. గర్భిణులకు అవసరమైన వైద్య సేవల కోసం పీహెచ్సీల్లోని వైద్యులను సమన్వయం చేసుకుని అవసరమైన చికిత్స అందిస్తూ మందులను అందిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్కు అనుబంధంగా రక్త నమూనాలు సేకరిస్తున్నారు.
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు..
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా దవాఖానతోపాటు ఆయా పీహెచ్సీల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటుకు దీటైన సేవలతో జిల్లా దవాఖాన ఉత్తమ సేవలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది. పట్టణ శివారు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖాన ఏర్పాటుచేసి అందుబాటులోకి తేగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. బస్తీ దవాఖానలో ఉదయం నుంచి సాయంత్రం దాకా వైద్యులు అందుబాటులో ఉండి సేవలందిస్తుండడంతో ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. దవాఖాన ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు, స్థానిక ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రజలకు అందుబాటులో..
మున్సిపల్ శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం బస్తీ దవాఖాన ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వరకు రావాలంటే ప్రజలకు కొంత భారంగానే ఉండేది. ప్రయాణం, ఖర్చు, సమయం అన్నింటినీ ఆదా చేసుకునే విధంగా ప్రజలందరికీ వెసులుబాటు ఉండేలా బస్తీ దవాఖాన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దవాఖాన ఏర్పాటుకు సహకరించిన మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్
విశేష ఆదరణ వస్తోంది..
సెప్టెంబర్ 27న బస్తీ దవాఖాన ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండడంతో మొదటి రోజు నుంచే వైద్య సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. రోజుకు 30 నుంచి 40మంది రోగులకు ఓపీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని వసతులు ఏర్పాటుచేసి రోగులకు మెరుగైన వైద్యం అందిస్తాం.
– డాక్టర్ రమేశ్, మెడికల్ ఆఫీసర్
మంచిగ చూసిండ్రు..
మాది రాజీవ్నగర్. ఈ వయసులో నాకు నడవడమే కష్టంగా ఉంది. సిరిసిల్ల దవాఖాన దాక పోవాలంటే రానుపోను మస్తు అవస్థ అయ్యేది. మా ఇండ్ల మధ్యే దవాఖాన పెట్టిండ్రు. డాక్టర్ మంచిగ పరీక్ష చేసి మందులు ఇచ్చిండు. కేటీఆర్ సార్ పెద్ద మనసుతో మా కోసం ఇక్కడ దవాఖాన పెట్టించిండు. మా వాడకట్టోళ్లు అందరూ గీన్నే సూపెట్టుకుంటున్నరు.
– ఎల్లవ్వ, వృద్ధురాలు, రాజీవ్నగర్
ఉచితంగా మందులు ఇచ్చిండ్రు..
నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న. బస్తీ దవాఖానకు వచ్చి పరీక్షలు చేపించుకున్న. రమేశ్ డాక్టర్ పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇచ్చిండు. గరీబోళ్లకు అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు ఏర్పాటుచేయడం సంతోషంగా ఉంది.
– ఎస్కె.యూసుఫ్, రాజీవ్నగర్