బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత ఇలాకాలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్రను కరీంనగర్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి ముగించాలని అనుకున్నా.. అందుకు పదిహేను ఇరవై రోజుల నుంచి ఏర్పాట్లు చేసినా.. చివరకు జనం లేక వెలవెలబోయింది. గురువారం సాయంత్రం ఎస్సారార్ కాలేజీ మైదానంలో నిర్వహించిన ఈ సభకు అసలే అంతంతే వచ్చిన జనం, సంజయ్ మాట్లాడుతుండగానే వెనుదిరగడం కనిపించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మాట్లాడే వరకు ప్రాంగణం పల్చబడింది. చివరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ మాట్లాడకుండానే సభ క్లోజ్ చేయగా, చప్పగా సాగిన ప్రసంగాలతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపించింది.
కరీంనగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడుత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వెలవెలబోయింది. భైంసాలో ప్రారంభించిన ఈ యాత్రను కరీంనగర్లో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించి గొప్పగా ముగింపు పలకాలని ఆ పార్టీ నాయకులు పది హేను ఇరవై రోజులుగా ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. కానీ, జనాన్ని మాత్రం తీసుకురాలేకపోయారు. గురువారం సాయంత్రం ఎస్సారార్ డిగ్రీ కాలేజీలో సభ నిర్వహించినా.. జనం మాత్రం అంతగా రాలేదు. అసలే తక్కువ సంఖ్యలో వచ్చిన జనం సభ మధ్యలోనే వెళ్లి పోవడం కనిపించింది.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాక ముందే జనం వెళ్లి పోవడాన్ని గమనించిన రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయినా జనం వెళ్లి పోసాగారు. బండి మాట్లాడుతుండగానే మధ్యలో జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ సభకు వచ్చారు. అప్పటికే వెళ్తున్న జనాన్ని గమనించిన సంజయ్ ‘ఎవరూ వెళ్లద్దు. మన నాయకుడు నడ్డా ఇప్పుడు మాట్లాడుతారు. ఆయన వెళ్లిన తర్వాత మీతో సెల్ఫీలు దిగుడే. దుమ్ముదుమ్ము చేసుడే’ అని ఊరించినా జనం నిలబడలేక పోయారు. ఈ పరిస్థితిని గమనించిన నడ్డా.. కిషన్ రెడ్డి, తరుణ్చుగ్ మాట్లాడకుండానే స్పీచ్ అందుకున్నారు. అప్పటికే సగానికి పైగా జనం ఖాళీ అయిపోయారు. వేదిక ముందు ఉన్న వీఐపీ గ్యాలరీలో తప్పా మిగతాచోట్ల జనం పల్చగా కనిపించారు.
కిషన్రెడ్డి మాట్లాడకుండానే..
బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరని చెప్పుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జేపీ నడ్డాతో కలిసి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చారు. బీజేపీ ఇటీవల నిర్వహిస్తున్న ప్రతి సభలో కిషన్ రెడ్డి ప్రధాన వక్తగా మాట్లాడుతున్నారు. కానీ, కరీంనగర్ సభ జనం లేక వెలవెలబోతున్న దృశ్యాన్ని చూసి ఆయన మాట్లాడకుండానే.. జేపీ నడ్డా మైక్ అందుకున్నారు. ఎన్నో సభలో కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బండి సంజయ్ ప్రసంగం కూడా కరీంనగర్ సభలో చప్పగా సాగింది. భైంసా గురించి ప్రస్తావిస్తున్న సమయంలోనే వేదికపైకి నడ్డా తదితరులు రావడంతో బండి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. ఎంతో మాట్లాడుతారని ఎదురు చూసిన కార్యకర్తలకు నిరుత్సాహానికి గురయ్యారు.
బీజేపీ రాష్ర్టానికి ఏం చేసిందో, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో అనే విషయాలను మర్చిపోయి నాయకులందరూ బీఆర్ఎస్ను ఆడిపోసుకోవడానికే పరిమితమయ్యారు. చివరికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నడ్డా కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని మర్చి పోయి బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలకే పరిమితమయ్యారు. మొత్తంగా చూస్తే సభ ఒక పద్ధతి ప్రకారంగా నిర్వహించ లేదని, పార్టీ జాతీయ నాయకున్ని ఆహ్వానించి ఆయన స్థాయికి తగినట్లు సభ ఏర్పాట్లు చేసినా జనాన్ని తరలించడంలో, వచ్చిన జనాన్ని సభ ముగిసేంత వరకు నిలువరించడంలో పూర్తిగా విఫలమయ్యారని స్వయంగా బీజేపీ నాయకులే అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.
నడ్డా గ్యో బ్యాక్
కరీంనగర్కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ఎస్సారార్ కాలేజీ మైదానంలోకి కాన్వాయిగా వస్తున్న నడ్డా వాహన శ్రేణికి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఎదురు తిరిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన రూప్ను తోసుకుని నడ్డా వాహనాన్ని అ డ్డుకునే ప్రయత్నం చేశారు. ‘నడ్డా గో బ్యాక్’ అం టూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ రాష్ర్టానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రతినిధిగా తెలంగాణకు ఎలా వస్తున్నారని నినాదాలు చేశారు.
కొత్త బిచ్చగాళ్లు పొద్దు ఎరగనట్టు బీజేపీ నాయకులు తెలంగాణపై రాబందుల్లా పడ్డారని మండి పడ్డారు. తెలంగాణ కోసం కేంద్రంలో అ ధికారంలో ఉండి బీజేపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. నడ్డా కాన్వాయిని అడ్డుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూలం సంపత్ గౌడ్, పెండ్యాల మహేశ్ కుమార్, రవి నాయక్, రుద్ర రాధ, గంటల రేణుక, రమేశ్ చారి, సంతో ష్ నాయక్, సాయి ఠాకూర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక తెలంగాణ చౌక్లోనే అంతకు ముందు కాంగ్రెస్ నాయకులు, నడ్డా రాకను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.