ఓ ప్రభుత్వ విభాగానికి చెందిన పనులను ఇతర విభాగాలు చేయవు. కానీ, నగరపాలక సంస్థ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఏకంగా తన పరిధిని దాటి ఎస్సారెస్పీ కాలువల్లో సిల్ట్ తొలగింపు కోసం ఇటీవల టెండర్లు పిలువడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, మే 24 : ఏ సంస్థలో అయినా తన పరిధిలోకి వచ్చే పనులు మాత్రమే చేస్తారు. కానీ, కరీంనగర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నగర పాలక పరిధిలోని రేకుర్తిలోని షేకాబీకాలనీ నుంచి గౌడకాలనీ వరకు ఉన్న ఎస్సారెస్పీ డీ94 కాలువలో సిల్ట్ తొలగింపు కోసం 5.80లక్షలతో రెండు పనులను అప్పగించేందుకు ఈ నెల 20న టెండర్లు నిర్వహించారు.
అయితే ఎస్సారెస్పీ కాలువలో సిల్ట్ను బల్దియా ఎలా తొలగిస్తుందని పలువురు అధికారులే విమర్శిస్తున్నారు. తన పరిధిలోకి రాని పనులను ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కేవలం కాంట్రాక్టర్లు, అధికారులు బిల్లులను పంచుకునేందుకే ఈ పనులను చేర్చారన్న ఆరోపణలు చేస్తున్నారు. అలాగే నగరంలోని పలు కాలనీల్లో 500 మీటర్లు కూడా ఉండని మురుగు కాలువలో సిల్ట్ తొలగింపు కోసం ఏకంగా 4.85 లక్షలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఇటీవలే నూతనంగా నిర్మించిన మురుగు కాలువల్లోనూ సిల్ట్ తొలగింపునకు పనులు పెట్టడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నూతన కాలువల్లో కూడా సిల్ట్ పేరుకుపోవడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయినా ఎండకాలం అయిపోయి వానకాలం దగ్గర పడుతున్న తరుణంలో సిల్ట్ తొలగింపు పనులు చేయడం వెనుక అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అక్రమాలకు అధికారులు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.