సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 22: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పరిధిలోని ఆర్టిజన్ కాలనీ ప్రాథమిక పాఠశాల సరికొత్తగా మారింది. సకల వసతులు, ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూల్ను తలపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కింద తొలివిడత తంగళ్లపల్లి మండలంలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో బద్దెనపల్లి, దేశాయిపల్లె ప్రాథమిక స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో బద్దెనపల్లి స్కూల్కు 13లక్షలు మంజూరయ్యాయి. అందులో 3.40లక్షలతో కిచెన్ షెడ్, 4లక్షలతో ప్రహరీ నిర్మాణం, 3.10లక్షల ఈజీఎస్ నిధులతో వెస్ట్రన్ టాయిలెట్స్ నిర్మించారు. 2.99లక్షలతో ఎలక్ట్రిషన్, తాగునీరు, 5వేల లీటర్ల నీటి ట్యాంకు, తరగతి గదుల్లో ప్యాన్లు, ట్యూబ్ లైట్లు, డెస్క్లతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కొడుకు సాకేతిరావు సహకారంతో పాఠశాలకు రంగులు, గోడలపై అందమైన చిత్రాలు వేయించారు. పనులన్నీ పూర్తికావడంతో ఇటీవలే పాఠశాలను ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ పుర్మాణి మంజుల, ఎంఈవో దూస రఘుపతి, ఎంపీడీవో లచ్చాలు, ఎంపీటీసీ సిలువేరి ప్రసూన, ఎస్ఎంసీ చైర్మన్ గుగ్గిల్ల సత్యనారాయణ, ప్రజాప్రతినిధుల సమక్షంతో ప్రారంభించారు. కాగా, స్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్ గుగ్గిల్ల సత్యనారాయణ, పేరెంట్స్ సహకారంతో ఇద్దరు వలంటీర్లను నియమించుకొని ఇంగ్లిష్ మీడియంలో బోధన అందిస్తున్నారు.
మా బడి మారింది
మా బడి చాలా మారింది. మొన్నటిదాకా బడికి రావాలంటేనే బాధగా అనిపిస్తుండె. టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ నిర్మించారు. నీటి సౌకర్యం, చుట్టూ ప్రహరీ కట్టించిండ్రు. చాలా సేఫ్గా అనిపిస్తుంది. పాఠశాల కొత్తగా ఉంది. బడి రావాలని ఉత్సాహంగా ఉంది. మా స్కూల్ కు మన ఊరు-మన బడిలో ఎంపిక చేసిన కేటీఆర్ సార్కు థ్యాంక్స్.
– కృష్ణవేణి, విద్యార్థిని (బద్దెనపల్లి)
పాఠశాలకు కొత్త రూపు తెచ్చాం..
పాఠశాలల్లో సకల వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన మన ఊరు-మన బడి కార్యక్రమం చాలా గొప్పది. స్కూళ్లలో అన్ని వసతులు సమకూరుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారుతున్నాయి. మా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించి కొత్త రూపు తెచ్చాం. పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాం. ఒకప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. పిల్లలు చాలా సంతోషంగా స్కూల్కు వస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– సామల గౌరవ్వ, హెచ్ఎం, ఆర్టిజన్ కాలనీ, బద్దెనపల్లి
సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాం
మన ఊరు-మన బడి కార్యక్రమం చాలా బాగున్నది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో దోహదపడుతున్నది. పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాం. మండలంలో తొలి విడతగా 15 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో బద్దెనపల్లి, దేశాయిపల్లె స్కూళ్లను పైలట్గా ఎంపిక చేశాం. బద్దెనపల్లిలో ఇటీవలే పనులు పూర్తి చేసుకున్నాం. ప్రారంభించుకున్నాం. దేశాయిపల్లె స్కూల్ పనులు చకచకా జరుగుతున్నాయి.
– లచ్చాలు, ఎంపీడీవో (తంగళ్లపల్లి)