ధర్మారం, డిసెంబర్ 28: మండల కేంద్రంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో గురువారం రాత్రి పడిపూజ (మెట్ల పూజ) మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపకుడు తాటిపల్లి ఈశ్వర్- సునీత దంపతుల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా చేపట్టారు. గట్టు నరహరి శర్మావధాని నేతృత్వంలో కేరళలోని శబరిమాల తరహాలో అక్కడి తాంత్రికుడు ఉన్నికృష్ణ నంబూద్రితో ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయం ఆవరణలో అష్టద్రవ్య గణపతి హోమాన్ని ఈశ్వర్ పర్యవేక్షణలో పూజారి నర్సింగరావు, అర్చకులు చేశారు. అనంతరం మూల విరాట్కు మహాభిషేకం, కనకాభిషేకం, పుష్పాలంకరణ చేపట్టారు. సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహాన్ని దీక్షాపరులు శ్రీ రామాలయం నుంచి రథంలో అయ్యప్ప కీర్తనలు పాడుతూ ఊరేగించారు. వివిధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు ప్రదర్శనతో అబ్బుర పరిచారు. అయ్యప్ప స్వామి ఆలయ మెట్ల వద్ద నంబూద్రి ఆధ్వర్యంలో పడిపూజ కనుల పండువగా సాగింది. అయ్యప్ప శరణు ఘోషతో ఆలయం మార్మోగింది. స్వాములు అగ్నిగుండాల ప్రదర్శనతో ఉత్సవం ముగిసింది. కార్యక్రమంలో జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, సర్పంచ్ జితేందర్రావు, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీ-1 తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ తదితరులున్నారు.
జ్యోతినగర్, డిసెంబర్ 28: ఎన్టీపీసీ టౌన్షిప్లోని హరిహర ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు, గురుస్వామి వామన్శర్మ ఆధ్వర్యంలో మంగళవారం అర్థరాత్రి వరకు పూజలు నిర్వహించారు. ముందుగా వేదపడింతులు మంత్రోచ్ఛారణలతో గణపతి హోమం చేపట్టి స్వామివారికి అభిషేకం చేశారు. నూతన వస్త్రలంకరణ పూజలు చేపట్టారు. అనంతరం దీక్షాపరులకు అన్నదానం, సాయంత్రం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహంతో పల్లకీ సేవ నిర్వహించారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ సభ్యులు జనగామ తిరుపతి, గురుస్వాములు ప్రభాకర్, చిప్ప కృష్ణప్రసాద్, శ్రీధర్, శ్రీనివాస్, చంద్రారెడ్డి, నందం నాగవర్ధన్రావు, దువాసి నారాయణ, అర్చకులు రామాచారి, రాజానరేంద్ర, ఆలయ ఇన్చార్జి సంపత్రావు తదితరులు ఉన్నారు.
పూసాల శ్రీశంభు లింగేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానంలో భాగంగా బుధవారం కందుకూరి పద్మ-ప్రకాశ్రావు(పెద్దన్న), కుమారులు సాయి నిఖిల్(సన్నీ), సాయి అఖిల్(బన్నీ) ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, ఎంపీపీ బాలాజీరావు-స్వరూప దంపతులు, గురుస్వామి మాటేటి శ్రీనివాస్ పాల్గొని పూజలు చేసి, అయ్యప్ప స్వాములకు అన్నం వడ్డించారు. కార్యక్రమంలో అన్నదాన శిబిరం నిర్వాహకుడు పురం రమణ తదితరులు ఉన్నారు.