పెద్దపల్లి టౌన్, ఆగస్టు 21 : కాంగ్రెస్ సర్కారుపై ఆటోడ్రైవర్లు ఆగ్రహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం శుక్రవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో కదం తొక్కారు. దాదాపు 300 ఆటోలతో బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆటో డైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ వెంటనే ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈనెల 24న రాష్ట్రవ్యాప్త ఆటోల సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకంతో గిరాకీలు తగ్గి ఆటోడ్రైవర్ల పరిస్థితి ఆర్థికంగా దిగజారిందని, దాదాపు 200 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని, రూ.8వేలుగా ఉన్న ఇన్సూరెన్స్ను రూ.వెయ్యికి తగ్గించాలన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 24న ఆటోల బంద్ నిర్వహిస్తామని, 25న సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు వ్యాళ్ల హరీశ్రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో రేవంత్రెడ్డి సర్కారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మహలక్ష్మి పథకం పేరిట లక్షలాది మంది ఆటో డ్రైవర్లు జీవనోసాధి కోల్పోయారని ఆవేదన చెందారు. వారికి ఎవరు భరోసానిస్తారని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై సీఎం రేవంత్రెడ్డి ఏనాడూ మాట్లాడడం లేదని ఆగ్రహించారు. చలనం లేని కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నిరసనలో నాయకులు ఎనగందుల నాంపల్లి, ఎస్కే జాబ్బర్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, బందారపు శంకర్, బండ సురేశ్, ఎస్డీ పురహాన్, మడిపెద్ది రమేశ్, తాడురి రమేశ్, చిలుముల స్వామి, ఈర్ల శంకర్, యదగిరి శంకర్, శ్రీధర్, నిజాం, వంశీ, బెక్కం శంకర్, తదితరులు పాల్గొన్నారు.