కరీంనగర్ తెలంగాణచౌక్, జనవరి 3: మహిళలకు బస్సు ఫ్రీ జర్నీ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆటో కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, నగర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం వందలాది మంది ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు.
జిల్లా కేంద్రంలోని బస్టాండు ఎదుట, తెలంగాణ చౌక్లో బాటసారులు, ప్రయాణికుల వద్ద భిక్షాటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరిపించి తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ చౌక్ వద్ద ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దండాలు పెట్టి వేడుకున్నారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ప్రయాణ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపడ్డాయన్నారు. కరీంనగర్ జిల్లాలో 17 వేల మంది జీవనోపాధి కోల్పోయారని, పథకం ప్రారంభించిన నాటి నుంచి రోజుకు కనీసం 200 కూడా రావడంలేదన్నారు. పిల్లలు ఫీజలు, ఇంటి కిరాయి, ఆటో ఫైనాన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పథకానికి తాము వ్యతిరేకం కాదని, తమను వెంటనే ఆదుకోవాలని, ప్రతి నెలా 15వేల జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్లో భారీ ఎత్తున ఆటో డ్రైవర్లతో నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సంపత్, మల్లేశం పాల్గొన్నారు.