కేసీఆర్ సార్ అనుకున్నడంటే ఎన్ని కష్టాలొచ్చినా అమలు చేసి తీరుతడు. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు చూసినం. కొన్ని చెప్పని పథకాలు కూడా చేసి చూపించిండు. చెప్పినవి కూడా చేసిండు. ఇపుడు కేసీఆర్ బీమా పథకం అమలు చేయడం కేసీఆర్ సార్కు పెద్ద లెక్కకాదు. తప్పక చేస్తడని నమ్మకం ఏర్పడింది. నిన్న మ్యానిఫెస్టోలో ఏం చెబుతడో అని కోట్లాది మంది ఆత్రుతతో ఎదురు చూసిండ్రు. చాలా మంది పథకాలు మ్యానిఫెస్టోలో పెట్టి పేదలకు అండగా నిలబడుతనని చెప్పకనే చెప్పిన్రు. ఇలాంటి పథకం అన్ని రాష్ర్టాల్లో అమలు కావల్సిన అవసరం ఉన్నది. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకే కాకుండా నిరుపేదలు ఎవరున్నా వారికి ఇచ్చేలా చూడాలి.
– కొత్తపేట తిరుపతి, కట్ట రాంపూర్ కరీంనగర్
రెక్కలను నమ్ముకొని రోజంతా కష్టం చేస్తేనే ఓ పేద కుటుంబం గడుస్తుంది. సమాజంలో నిలబడుతుంది. ఉన్నంతలో పిల్లల చదువైనా, మరే అవసరమైనా తీరుతుంది. కానీ ఆ ఇంటి పెద్దకు అనుకోకుండా ఏమైనా జరిగితే ఆ ఇల్లు ఆగమవుతుంది. రోడ్డున పడుతుంది. అప్పటిదాకా ఓ మాదిరి బతికిన కుటుంబమైనా.. ఏ ఆధారం లేక, ఆదరించే, ఆదుకునేవాళ్లు లేక పాతాళానికి పడిపోతుంది. ఇలాంటి కుటుంబాలకు ఓ ధైర్యాన్ని, ఓ ఆర్థిక అండను ఇచ్చేందుకు బీఆర్ఎస్ మరో విప్లవాత్మక పథకాన్ని తెస్తున్నది. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ రైతు బీమా తరహాలో ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’ను అమలు చేస్తామని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. వ్యక్తి ఏ కారణంతో చనిపోయినా కుటుంబానికి రూ.5లక్షల బీమా వర్తింపజేస్తామని చెబుతుండగా, ఈ పథకంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 10 లక్షల కుటుంబాలకు భరోసా దొరుకనున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 4,48,325 మందికి రైతు బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఐదేండ్లుగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసులో ఉన్న పట్టాదారులైన రైతులందరూ బీమా పరిధిలోకి వస్తున్నారు. వీరికి సంబంధించిన బీమా ప్రీమియం ఏటా ప్రభుత్వమే చెల్లిస్తోంది. పట్టాదారుడైన రైతు ప్రమాదవశాత్తు లేదా ఇతర ఏ కారణాలతోనైనా మృత్యువాత పడితే అతడి కుటుంబ సభ్యులకు పదిరోజుల వ్యవధిలో బీమాకు సంబంధించిన రూ.5లక్షలు అందేలా చేస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఈ ఐదేండ్లలోనే పదివేలకు పైగా మృతిచెందిన రైతుల కుటుంబాలకు ప్రయోజనం కలిగింది.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘కేసీఆర్ బీమా’ పథకంపై రాష్ట్రంలో జోరుగా చర్చజరుగుతున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించాలని తాము భావిస్తున్నామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ఏడాది జూన్ నుంచి (బీమా సంవత్సరం ప్రారంభం అయ్యే తేది ) రాష్ట్రంలో ఉన్న 93 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డు దారులైన కుటుంబాలన్నింటికీ వర్తింప చేస్తామని ప్రకటించగా, ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇలాంటి ఆలోచన గతంలో ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి రాలేదని, రైతన్నలకు తొలిసారిగా అమలు చేసిన బీమా పథకం అనుభవంతో సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడానికి సంకల్పించడం చాలా గొప్ప విషయమంటున్నారు. ఈ పథకం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 10 లక్షల కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉంది.
కరీంనగర్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : మన్నును నమ్ముకుని మిన్ను వైపు ఆశగా చూస్తూ.. కంటి నుంచి దుఃఖం పొంగుతున్నా కన్ను కొనల్లో దాచిపెట్టి.. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని.. దశాబ్దాలుగా ఎదురు చూసిన కర్షకులకు 60 ఏండ్లుగా నిరాశే ఎదురైంది. అందరికీ అన్నం పెట్టే తమను ఏదో ఒక ప్రభుత్వం ఆదుకుంటుందని, తనకు అండగా నిలుస్తుందని స్వప్నించిన రైతన్నకు అది కలగానే మిగిలిపోయింది. అలాంటి తరుణంలో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్, ప్రపంచంలో ఏ దేశంలో, ఏ నాయకుడు అమలు చేయని విధంగా, రైతు బీమా అనే మహత్తర పథకాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
రైతు ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం చెందితే రైతు కుటుంబానికి ఊతంగా నిలిచేలా అమలు చేస్తున్నారు. 59 ఏండ్లలోపు వయసున్న ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని కల్పించి, రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తూ రాగా ఈ పథకం రైతు కుటుంబానికి ఒక దన్నుగా మారిపోయింది. జీవితాలకు ఊతకర్రగా నిలుస్తున్నది. అయితే ఇప్పటి వరకు రైతన్నలకు వర్తింపజేసిన పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. కేసీఆర్ బీమా పేరిట ఏర్పాటు కానున్న ఈ పథకంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 9,64,807 ఆహార భద్రత కుటుంబాలకు దీమా ఏర్పడబోతున్నది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ పేద కుటుంబానికి రైతు బీమా తరహాలో రూ. 5లక్షల బీమా కల్పిస్తామనడం నిజంగా హర్షణీయం. మ్యానిఫెస్టోలో ‘కేసీఆర్ బీమా ప్రజలకు ధీమా’ అనే నినాదంతో బీమా కల్పించడం సంతోషం. ఇప్పడు రైతుబీమా పథకాన్ని వంద శాతం అమలు చేస్తున్నారు. అదే విధంగా పేద ప్రజలకు సైతం బీమా కల్పిస్తాననడం ఆనందంగా ఉంది. ఈ పథకంతో పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగనుంది.
– ఎం ప్రణన్య, గృహిణి (మంథని)
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ‘కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా’ పథకం ప్రజలకు బాగా నచ్చింది. కుటుంబ పెద్ద చనిపోతే బీమా పథకం ద్వారా 5లక్షలు రావడంతో ఆర్థిక భరోసా కలుగుతుంది. గతంలో రైతులకు మాత్రమే బీమా ఉండేది. ఇప్పుడు తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఒకరికి బీమా కల్పించడం హర్షణీయం. కేసీఆర్ గతంలో మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందించారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిద్దాం. ప్రతి ఒకరూ కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కంకణం కట్టుకోవాలి.
ఇప్పటికే అమలులో ఉన్న రైతుబీమా పథకం ఆ కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. రైతు బీమా తరహాలోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 5లక్షల బీమా ఆర్థిక భరోసానిస్తుంది. కేసీఆర్ ప్రకటించిన బీమా పథకంపై, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు పేదల గురించి ఆలోచన చేసి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న సీఎం కేసీఆరే మళ్లీ భారీ మెజార్టీతో గెలుస్తారు. సీఎం కేసీఆర్ చేస్తున్న పనులపై, పథకాలపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది.
– ఒడ్నాల జగన్, రేచపల్లి, సారంగాపూర్ మండలం
గతంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్ సార్ చేస్తున్నరు. నిన్న ఇచ్చిన మ్యానిఫెస్టోల చెప్పిన ప్రతీది అమలు చేస్తరన్న నమ్మకం మాకున్నది. నేను ఆటో నడుపుకుని బతుకుతున్న. నాకు ఏదైనా అయితే, నా కుటుంబం దిక్కులేనిది అవుతది. నా లెక్క రకరకాల పనులు చేసుకుని బతికేటోళ్లు ఉన్నరు. సంపాదించి తెచ్చి పెట్టేటోళ్లు దురదృష్టం కొద్ది చనిపోతే ఆ ఇల్లు చీకటై పోతది. చిన్న చిన్న పిల్లలు ఉన్నోళ్లయితే చానా కష్టాలు పడాల్సి వస్తది.
అసోంటి పరిస్థితి ఉండకుంటా కేసీఆర్ సార్ మంచి ఆలోచన చేసిండ్రు. మల్లోసారి గెలిస్తే తప్పక అమలు చేస్తడనే నమ్మకం నాకే కాదు.. చానా మంది పేదోళ్ల మనుసుల ఉన్నది. అంతెందుకు మ్యానిఫెస్టోలో పెట్టనివి సుతం అమలు చేసిండు. మాకు షాదీముబారక్ పెట్టిండు. మా ఇంట్ల మా చెల్లికి వచ్చింది. నాకు కొడుకు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. 12 వేల రూపాయలు ఇచ్చిండ్రు. లాక్డౌనపుడు మేం ఇవే పైసలతోని ఇల్లు గడుపుకున్నం. మా లెక్కన ఎందరో నిరుపేదలకు కేసీఆర్ సార్ అండగా నిలబడ్డరు. కేసీఆర్ బీమాపై మాకు ఎంతో భరోసా ఉన్నది. మాకు తప్పక అమలవుతది. కేసీఆర్ సార్ చెప్పిండంటే చేసి చూపిస్తరు.
– అబ్దుల్ రహీం, ఆటో డ్రైవర్, భగత్నగర్ కరీంనగర్
రైతన్నలకు అమలు చేస్తున్న మాదిరిగానే కుటుంబాలకు సైతం బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9,64,807 తెలుపు రంగు రేషన్ కార్డు దారులున్నారు. జగిత్యాల జిల్లాలో 2,93,042 తెల్ల రేషన్కార్డులు ఉండగా, ఇందులో 8,49,698 మంది సభ్యులున్నారు. సిరిసిల్ల జిల్లాలో 1,74,050 కుటుంబాలు ఉండగా, 5,00,562 మంది సభ్యులుగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 2,78,411 కుటుంబాలు ఉండగా, 8,11,443 మంది సభ్యులుగా ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో 2,19,304 కార్డులు ఉండగా, 3,83,706 మంది సభ్యులుగా ఉన్నారు. భవిష్యత్తులో కుటుంబ బీమా పథకం పరిధిలోకి ఉమ్మడి జిల్లాలో ఉన్న 9,64,807 కుటుంబాలు వస్తాయి. ఇందులో అర్హులైన వారందరికి బీమా సౌకర్యం వర్తిస్తుంది.
మాకు ఏదీ ఉన్నా లేకున్నా వయసు ఉంటే చాలు బీమా ఇస్తామని కేసీఆర్ సార్ ప్రకటించడం సంతోషం. మాలాంటోళ్లకు ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. దీంతో కుటుంబపెద్దకు ఏమైనా, ఆ కుటుంబానికి 5లక్షలు వస్తున్నై. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని. నాపేరు మీద ఇంత భూమి ఉంటే మంచిగుండు అని. కానీ ఇక నాలాంటోళ్ల బాధలు తీరినై. గతంలో ఇట్ల ఆలోచించినోళ్లే లేరు. మా లాంటోళ్ల గోసలన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ సార్.
– బాన ఉమాదేవి, కూరగాయల వ్యాపారి, (రామగుండం)
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రైవేటీకరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఎల్ఐసీకి, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెద్ద ఊరటను అందిస్తూనే వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు గ్రూప్ పాలసీలను చెల్లిస్తూ ఎల్ఐసీ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న రాష్ట్ర సర్కారు, మరోసారి ఎల్ఐసీకి పెద్ద అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకు సంబంధించి గ్రూప్ పాలసీని ఎల్ఐసీ పరిధిలో తీసుకుంటే, ఎల్ఐసీకి కలిగే ప్రయోజనం అత్యధికంగా ఉంటుందని ఆ సంస్థ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీ సంస్థకు పెద్ద ఎసెట్గా మారిందని, రానున్న రోజుల్లో కోటికి పైగా గ్రూప్ పాలసీలు, అంటే ఎల్ఐసీ పూర్తిగా లాభాల్లోకి వచ్చేస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు తెలుపురంగు రేషన్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పిస్తే ఉమ్మడి జిల్లా పరిధిలో 30 లక్షల మందికి పైగా బీమా పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబీమా పథకంలో 18 నుంచి 59 ఏండ్ల మధ్యలో ఉన్న వారందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ పరిధిలోకి చేర్చి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తున్నది. ఇదే పద్ధతిన కుటుంబాల బీమా విషయంలో పాటిస్తే, తెలుపురంగు రేషన్కార్డు ఉన్న కుటుంబంలో ఎందరు 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల మధ్య వయసులో ఉంటారో వారందరూ బీమా పరిధిలోకి వస్తారని చెబుతున్నారు. మరికొన్ని పాలసీల్లో చిన్న పిల్లలను సైతం పాలసీ పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయని, అయితే ప్రభుత్వం రైతు బీమాకు సంబంధించి పాటిస్తున్న పద్ధతిలో 18-59 మధ్య వయస్సు వారికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. భారీ సంఖ్యలో గ్రూప్ ఇన్సూరెన్స్కు సంబంధించిన పాలసీల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసే సరైన పాలసీ అని, భవిష్యత్తులో కుటుంబాలకు వర్తింపజేసే బీమాలోను ఇదే వర్తింపజేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. ఈ పద్ధతిని అమలు చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో దాదాపు 30 లక్షల మంది పాలసీ పరిధిలోకి వస్తారని చెబుతున్నారు.
ఎంతో మంచి పథకం ..
కేసీఆర్ సార్ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి పథకం పేదోళ్ల కోసమే పెట్టిండు. ఇపుడు కేసీఆర్ బీమా.. ఇంటింటికీ ధీమాగా ఉంటది. మాలాంటి ఎందరో కుటుంబాలకు ఈ పథకం అండగా నిలబడుతదని నమ్మకం ఉన్నది. ఇసోంటి పథకాలు ఇప్పటి వరకు ఏ ఒక్కలన్న చేసిన్రా.. గతంల ఎన్నెన్నో చెప్పినోళ్లు ఓట్లు వేయించుకుని పేదోళ్లను పట్టించుకోలే. తెలంగాణ వచ్చినంక, కేసీఆర్ సీఎం అయినంక అనేక పథకాలు అమలైనయి. వాటితోని పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటున్నరు. ఇపుడు కేసీఆర్ బీమా పథకం కూడా తప్పక అమలు చేస్తడన్న నమ్మకం మాకు ఉన్నది. ఇసోంటి పథకాలు పెడితే కొంచెం పేదలకు పనికొస్తయ్. ఏవేవో పథకాలు పెట్టి అమలు చేయకుంటనే ఐదేళ్లు గడుపుడు దేనికి. మేం కేసీఆర్ను తప్ప ఇంకొకలను నమ్మం..
– ఆకారపు శ్రవణ్, చిరు వ్యాపారి, కిసాన్నగర్, కరీంనగర్