కరీంనగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంగా ముగిశాయి. గురువారం ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చారు. ఉదయం కొంత మందకొడిగా ఓటింగ్ జరిగినా మధ్యాహ్నం వరకు పుంజుకున్నది. జిల్లాలో రెండు చోట్ల స్వల్పంగా ఘర్షణలు జరగడం, మరో రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాలేదు. కాగా జిల్లాకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు కేంద్రాల్లో సాయంత్రం ఓటర్లు కేంద్రాల్లో బారులు తీరి నిల్చోవడం కనిపించింది.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి కనిపించారు. మధ్యాహ్నం కొంత మందకొడి అనిపించినా సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారి ఆయా కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామీణ ప్రాంతా ల్లో పనులకు వెళ్లిన వారంతా ఈ సమయంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ నగరంలోని పలు డివిజన్లలో కూడా ఓటర్లు బారులు తీరి కనిపించారు. నగరంలోని కిసాన్ నగర్లో, కాపువాడలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. సైదాపూర్ మండలంలోని రాయికల్లో పోలీసులు, గ్రామస్తులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్తులపై స్వల్ప లాఠీచార్జి చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి.
చిగురుమామిడి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప గొడవ జరిగింది. కాంగ్రెస్కు మద్దుతుగా ఉన్న జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవిందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎన్నికలు ముగియగానే వదిలేశారు. సీపీ అభిషేక్ మహంతి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి ఎన్నికల సరళిని నిత్యం పర్యవేక్షించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల రాత్రి వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరితో అధికారులు ఓట్లు వేయించారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉద యం మందకొడిగా సాగిన పోలింగ్ 11 గంటల తర్వాత గంట గంటకూ ఊపందుకున్నది. కరీంనగర్లో ఉదయం 9 గంటల వరకు 6.13 శాతం, 11 గంటల వరకు 14.06 శాతం, మధ్యాహ్నం1 గంట వరకు 38.90 శాతం, 3 గంటల వరకు 53.71 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 64.17 శాతం పోలింగ్ నమోదైంది. చొప్పదండి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 12.45 శాతం, 11 గంటల వరకు 24.32 శా తం,
మధ్యాహ్నం 1 గంట వరకు 39.34 శాతం, 3 గంటల వరకు 54.15 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 70.25 శాతం మంది ఓటేశారు. మానకొండూర్లో ఉదయం 9 గంటల వరకు 10 శాతం, 11 గంటల వరకు 26.74 శాతం, మధ్యాహ్నం 1 గంటల వరకు 44.38 శాతం, 3 గంటల వరకు 62.75, సాయంత్రం 5 గంటల వరకు 75.12 శాతం పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్లో ఉదయం 9 గంటల వరకు 5.36 శాతం, 11 గంటల వరకు 18.03 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 41.40 శాతం, 3 గంటల వరకు 55.16 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 70.23 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాత్రి పొద్దు పోయే వరకు పోలింగ్ జరిగింది. అయితే, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో అధికారులు స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు తమకు కేటాంచిన ఈవీఎం మిషన్లను రాత్రి పొద్దు పోయే వరకు స్ట్రాంగ్ రూంలకు తరలించారు. జిల్లా ఎన్నిల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూంలో వీటిని భద్రపర్చారు. మూడంచెల పద్ధతిలో స్ట్రాంగ్ రూంలకు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.