కలెక్టరేట్, ఏప్రిల్ 30: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు చెరువులు, కుంటల ఆలనాపాలన విస్మరించడంతో వాటి కింద ఉండే శిఖం భూమి ఆక్రమణకు గురైంది. ఏటేటా చెరువుల విస్తీర్ణం తగ్గి భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఫలితంగా తాగేందుకు గుక్కెడు నీరు కూడా లభించని దుస్థితి సీమాంధ్ర పాలకుల హయాంలో ఉండేది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి నిల్వలతోనే గ్రామ సీమలు అభివృద్ధి చెందుతాయని ప్రకటించి, ఇందుకనుగుణంగా బృహత్తర ప్రణాళిక రూపొందించారు. మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి ఆనవాళ్లు లేకుండా మారుతున్న చెరువులు, కుంటల్లో పూడిక తీయించి పూర్వవైభవం తెచ్చారు.
దీంతో నాడు పశువులు దప్పిక తీర్చుకునేందుకు కూడా చుక్క నీరు లేక నెర్రెలు బారి, వెలవెలబోయిన చెరువులు, కుంటలు నేడు మండు వేసవిలో కూడా నిండుకుండలా నీటితో కళకళలాడుతున్నాయి. అలాగే, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా అన్ని చెరువులకు జియో ట్యాగింగ్ చేపట్టడంతో పాటు చెరువుల సర్వే, ఎఫ్టీఎల్ గుర్తింపు లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నీటి పారుదల శాఖ అధికారులు గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 1,376 చెరువులు, కుంటలకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. జిల్లాలోని చెరువుల ఫొటోలతో పాటు తూము, అలుగు, తదితర వివరాలు కూడా సేకరించారు.
993 చెరువుల ఎఫ్టీఎల్ (నీటి నిల్వ సామర్థ్యం) కూడా గుర్తించి ఆన్లైన్లో సమాచారం పొందుపరిచారు. చెరువులు, కుంటల కింద ఉన్న 21,932 ఎకరాల శిఖం ఆయకట్టు ఉండగా, ఇందులో శిఖం భూములతో పాటు ఏక్సాల్ పట్టా భూములు కూడా ఉన్నాయి. అయితే, ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో జిల్లాలో అనేకచోట్ల చెరువులు, కుంటల శిఖం భూములు కబ్జాకు గురయ్యాయి. మిషన్ కాకతీయ పథకం చేపట్టిన సందర్భంలో దీనిని గుర్తించినా, స్వాధీనం చేసుకోవడంలో సాంకేతిక కారణాలు అడ్డంకిగా నిలిచాయి. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖ, ల్యాండ్ సర్వే శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శిఖం భూముల సర్వే ప్రారంభించింది.
జిల్లా వ్యాప్తంగా 21,932 ఎకరాల 16 గుంటలు శిఖం భూమి ఉండగా, చెరువులు, కుంటల కింద సుమారు 10వేలకు పైచిలుకు ఎకరాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో ఇప్పటికే 3,489 ఎకరాల 38 గుంటల్లో సర్వే పూర్తి చేయగా, 162.09 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. కొన్ని చెరువులు, కుంటలు నీటితో నిండి ఉండడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. మరో పదిహేను రోజుల్లో చెరువుల్లో నీళ్లు తగ్గితే సర్వే చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేసి, డిజిటలైజేషన్ చేయనున్నట్లు నీటి పారుదల శాఖాధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో ఏ చెరువు ఎక్కడుంది, ఏ చెరువుకు ఎక్కడ తూము ఉంది, ఎక్కడ మత్తడి ఉంది, ఏ చెరువు నీటి నిల్వ సామర్థ్యం ఎంత, ఏ చెరువులో ఎన్ని ఎకరాల శిఖం భూములున్నాయి అనే పూర్తి సమాచారం ఒక్క క్లిక్తోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాగా, చెరువుల పరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.