కరీంనగర్, జూన్ 15(నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవం ప్రతీ గ్రామంలో విజయవంతమైంది. ఊరూరా ఉదయం నుంచే గ్రామ ప్రజలు బతుకమ్మలు చేతపట్టుకుని.. బోనాలు నెత్తిన ఎత్తుకుని ర్యాలీలు తీస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు మువ్వన్నెల జెండాలు ఆవిష్కరించి ప్రజలతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం సమావేశాలు ఏర్పాటు చేసుకుని పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో సాధించిన అభివృద్ధి, మారిన రూపురేఖలు, వచ్చిన మార్పుల గురించి వివరించారు. తర్వాత గ్రామం పంచాయతీ సిబ్బంది, కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేసి, ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ‘పల్లె ప్రగతి’పై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలు ఆకట్టుకున్నాయి.
వేడుకలకు హాజరైన ప్రముఖులు పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డులు, నర్సరీలను సందర్శించారు. మెరుగైన ఫలితాలు సాధిస్తున్న సర్పంచ్లు, పంచాయతీ సిబ్బంది, కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, కరీంనగర్ మండలంలోని చెర్లభూత్కూర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త చెరువు క్రీడా ప్రాంగణం నుంచి అంబేద్కర్ విగ్రహం గల ప్రాథమికోన్నత పాఠశాల వరకు గ్రామస్తులతో కలిసి బతుకమ్మలతో ర్యాలీ తీశారు.
తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే రసమయి, రేణికుంటలో జడ్పీ సీఈవో ప్రియాంక హాజరయ్యారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి, చెర్లపల్లి(ఎన్)లో జరిగిన ఉత్సవాల్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్, చెల్పూర్, జమ్మికుంట మండలం అంకుశాపూర్, వీణవంక మండలం రెడ్డిపల్లిలో మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు. అంకుశాపూర్, రెడ్డిపల్లిలో వీరితో పాటు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పాల్గొన్నారు. అంకుశాపూర్లో ప్రజలు డప్పుచప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలతో మండలి విప్కు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన గ్రామ పంచాయతీ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.