తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతీ పల్లె, పట్టణాల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్లెక్సీలు పట్టుకుని ర్యాలీలు తీశారు. ట్యాంకుల వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఫిల్టర్ బెడ్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ట్యాంకులను సందర్శించి నీటి సరఫరాపై అవగాహన కల్పించారు. పలు చోట్ల మిషన్ భగీరథ పథకంపై ఫొటో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కాగా, కొత్తపల్లి మండలంలోని ఎలగందులలో మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్ వేడుకల్లో పాల్గొన్నారు.
కరీంనగర్, జూన్ 18(నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీళ్ల పండుగ ఊరూ వాడా ఉత్సాహంగా సాగింది. ప్రతి పల్లె, గ్రామం, పట్టణాల్లో ఉదయం నుంచే మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది, పంచాయతీ, మున్సిపల్ కార్మికులు ప్లెక్సీలు పట్టుకుని వీధుల్లో ర్యాలీలు తీశారు. అనంతరం ట్యాంకుల వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధులు ఫిల్టర్ బెడ్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ట్యాంకులను సందర్శించి మిషన్ భగీరథ నీళ్ల నాణ్యత, సరఫరా గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నీటి శుద్ధి విధానాన్ని పరిశీలించారు. అనంతరం సమావేశాలు ఏర్పాటు చేసి నాడు తాగునీటి కోసం పడ్డ కష్టాలు, స్వరాష్ట్రంలో తొలగిన ఇబ్బందుల గురించి వివరించారు. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా, కొత్తపల్లి మండలం ఎలగందులలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని కరీంనగర్ సెగ్మెంట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్లోని ఫిల్టర్ బెడ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు పాల్గొన్నారు. ఎల్ఎండీ కాలనీలోని మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మానకొండూర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్ సందర్శించారు.
అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. మహిళలు, స్థానికులతో కలిసి భోజనాలు చేశారు. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి పట్టణాల్లో మంచి నీళ్ల పండుగ ఘనంగా జరుపుకున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికతోపాటు పలువురు మహిళా కౌన్సిలర్లు తమ ఇండ్ల ముందు ముగ్గులు వేసి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో స్థానిక సర్పంచులు, వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు మిషన్ భగీరథ నీళ్ల గురించి ప్రజలకు అవగాహన పర్చారు. నీళ్లు తాగడం వలన కలిగే ఉపయోగాలను వివరించారు. నీళ్లలో ఉన్న లవణాలతో కలిగే ఆరోగ్యాన్ని వివరంగా చెప్పారు. అనేక గ్రామాల్లో వాటర్ ట్యాంకుల వద్ద ముగ్గులు పోటీలు నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు గ్రామాల్లో పోటీల్లో విజేతకు బహుమతులు కూడా పంపిణీ చేశారు. ఇలా మంచి నీళ్ల పండుగకు ప్రతి చోట అనూహ్య స్పందన కనిపించింది.