దేశ జనుల హితం కోసం తన జీవితాన్ని ధారబోసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు తెలంగాణ సర్కారు సమున్నతంగా గౌరవిస్తున్నది. అధికారాన్ని అధిరోహించిన నాటి నుంచి నేటి వరకు తొమ్మిదేండ్ల కాలంలో ఆ మహనీయుడి స్ఫూర్తితో పాలన సాగిస్తున్నది. ఆయన చూపిన బాటలో సంక్షేమ ఫలాలను అట్టడుగు వర్గాలకు చేరవేస్తూ భరోసానిస్తున్నది. రాజ్యాంగ నిర్మాత మార్గదర్శకత్వంలో దళితబంధు, ఓవర్సీస్ స్కాలర్షిప్, డబుల్ బెడ్రూం, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్.. ఇలా ఎన్నో స్కీంలను అమలు చేస్తూ సామాజిక వివక్షకు చరమగీతం పాడుతున్నది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూనే.. కీర్తిని, స్ఫూర్తిని ఎలుగెత్తి చాటేలా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నేడు బాబాసాహెబ్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించనుండగా, ఉమ్మడి జిల్లా నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సిద్ధమైంది. మరోవైపు జిల్లాల్లోనూ పండుగ వాతారణంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు యంత్రాంగం అంతా సిద్ధం చేసింది.
కరీంనగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ అంటే ఒక శక్తి.. ఒక యుక్తి.. పీడిత జాతి విముక్తి.. భారత రాజ్యాంగ నిర్మాత. దేశ ఉన్నతికి, వికాసానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందరి వాడు. ఏ ఒక్కజాతికో, వర్గానికో, కులానికో పరిమితమైన వాడు కాదు. ఈ దేశంలోని అన్ని వర్గాలు, మతాలు, కులాల గురించి ఆలోచించి భారత రాజ్యాంగం ద్వారా నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు. అందుకే ఆయనను యావత్ భారత జాతి సంపదగా చెప్పుకుంటారు. ప్రపంచమే గర్వించదగిన ఆ మేధావి భారతావనిలో పుట్టడం ఈ దేశ ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. ఆయనను ఒక్క వర్గానికో, కులానికో పరిమితం చేయడం సరైనది కాదనే భావన ప్రతి ఒక్కరిలో కనిస్తున్నది. ఆయన సమయం, ఆరోగ్యం, బుద్ధి మొత్తం దేశం కోసమే సమర్పించిన మహనీయుడి జయంతి నేడు. ఆ అంబేద్కరుడి ఆలోచనలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ రోజు హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు అంబేద్కర్పై వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బాబాసాహెబ్ బాటలో కేసీఆర్ సర్కారు
సుధీర్ఘ పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, రాష్ట్ర సూత్రీకరణ అంబేద్కర్ ప్రతిపాదనలపైనే జరిగింది. ఆయన రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగానే రాష్ట్రం ఏర్పాటైంది. ప్రత్యేకంగా ఆవిర్భవించిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు. సకల జనులకు భరోసానివ్వడంతోపాటు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. విద్యా, వైద్యం, సంక్షేమం ఇలా అన్ని రంగాల్లో వినూత్న పథకాలతో ప్రోత్సాహం అందిస్తున్నారు. ముఖ్యంగా దళితులపై సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక మార్పునకు కృషిచేస్తున్నారు. దళితబంధులాంటి ప్రత్యేక పథకాలు తెచ్చి గౌరవంగా బతికేలా చేస్తున్నారు. ఈ పథకం కింద ఏకమొత్తంగా 10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తూ వారి అభ్యున్నతికి బాటలు వేశారు. యజమానులుగా, వ్యాపారులుగా, పారిశ్రామిక వేత్తలుగా కొత్త జీవితం ప్రసాదించారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 18వేల మందికిపైగా ఇవాళ సొంత కాళ్లపై నిలబడడమే కాదు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ గౌరవంగా జీవిస్తున్నారు. దళిత వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్సెంటివ్ స్కీం) పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసుకొనేందుకు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు చాటేలా హైదరాబాద్ నడిబొడ్డున దేశంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతి వనాన్ని నేడు ప్రారంభించనున్నారు.
అన్ని వర్గాలకూ సంక్షేమం
నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంపై ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారంటే అందుకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వల్లనే. స్వతంత్ర భారత దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఫలాలు అనుభవించేలా చేసిన మహానుభావుడు అంబేద్కర్. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఈరోజు తెలంగాణ సర్కారు ఆ మహనీయుడి బాటలో నడుస్తున్నది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసింది. దేశంలోని ఎక్కడా లేని విధంగా దళితబంధును తెచ్చి దళితుల జీవితాలను మారుస్తున్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ సాధించుకున్నాం. అందుకే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇది గర్వించదగ్గ విషయం. – డాక్టర్ జనపాల శంకరయ్య, రచయిత (రాజన్న సిరిసిల్ల)
మహనీయుడి స్మరణ అభినందనీయం
దేశ ప్రజలు నేడు స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నారంటే అందుకు ప్రాణవాయువులు ఇచ్చింది అంబేద్కరే. ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీ అయిన రాజ్యాంగాన్ని సృష్టించిన మహామేధావి ఆయన. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా లాంటి పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ ప్రజాస్వామిక దేశంగా భారత్ నేడు వెలుగుతుందంటే దానికి కారణం ఆ మహానుభావుడే. ఏ దేశ రాజ్యంగంలో లేని విధంగా ప్రతి అంశంపై స్పష్టమైన విధానాలు రూపొందించింది మన రాజ్యాంగంలోనే. కేంద్ర, రాష్ర్టాలుగా రెండు పరిపాలన వ్యవస్థలు, అంతలోనే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు, దాంతోపాటే సమాఖ్య లక్షణాలతో రాష్ర్టాలకు అధికారాల విభజన, కేంద్ర, రాష్ర్టాలకు ప్రత్యేకమైన శాసనసభలు, శాసనసభల ఆధీనంలో పనిచేసే విధంగా కార్యనిర్వాహక వర్గం ఏర్పాటుతో ఒక పకడ్బందీ పాలన వ్యవస్థను రూపొందించడం సామాన్యమైన విషయం కాదు. ఇక శాసనసభ హద్దుమీరి, రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉనికికే ప్రమాదాన్ని సృష్టిస్తే, వాటిని తుత్తినీయులు చేసే విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ రూపకల్పన చేసిన మహానుభావుడు అంబేడ్కర్. అంబేడ్కర్ ఒక అణగారిన వర్గాలకు చెందిన నాయకుడు కాదు, ఆయన భారతదేశంలోని ప్రతి వర్గానికి ప్రతినిధి. నేడు భారతీయ అస్తిత్వం బతికిందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే. ఆయన సర్వదా పూజనీయుడు. ఆ మహనీయుడికి తెలంగాణ సర్కారుకు గౌరవం ఇస్తున్నది. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నది. అంబేద్కర్ను స్మరించుకుంటూ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం, ఆ మహనీయున్ని స్మరించుకోవడం అభినందనీయం.
– మల్యాల ప్రతాప్, ఎంఏ, ఎల్ఎల్ఎం, న్యాయవాది (జగిత్యాల)
మనందరికీ గర్వకారణం
అంబేద్కర్ అంటే నిత్యచైతన్య స్ఫూర్తి. అసమాన జ్ఞానానికి నిలువెత్తు ద్వీప స్తంభం. అణగారిన వర్గాలకు అభ్యుదయ పథాన్ని అందించిన ప్రగతిశీలి. ప్రపంచానికే జ్ఞానాన్ని పంచిన మహనీయులు. భారత రాజ్యాంగ ప్రదాత. ఆచరణలో, అక్షరీకరణలో ప్రబోధాలలో, దీక్షా దక్షతకు కంకణ బద్దుడైన కార్యసాధకులు. అపర మేధావి. ఇవాళ అంబేద్కర్ను తలవని రోజు ఉండదు. ఆయన స్ఫూర్తితోనే భారత ప్రజాస్వామ్యం నిత్య వసంత శోభతో, నిలువెత్తు ఓటరు చైతన్యంతో పరిఢవిల్లుతున్నది. ప్రపంచ దేశాల జ్ఞాన నిధుల్ని తనలో ఇముడ్చుకుని, అణగారిన వర్గాల హక్కులపై ఆర్ధ్రతతో, ఆగ్రహంతో, ఆవేదనతో, ప్రశ్నించిన ధిక్కార స్వరం ఆయనది. రాజ్యాంగ ఫలాలన్నీ సామాన్యుని వరకు చేరవేయడంలో కృతార్థులయ్యారు. అనాథలు, బడుగు, బలహీన వర్గాలపై అపార ప్రేమ అంబేద్కర్కే సొంతం. ఆయన రచనలు కాంతి కవాటాలు.. ఆయన మాటలు దార్శనిక సూత్రాలు. ఆయన ముమ్మాటికి మనవాడు. మనందరి వాడు. మనల్ని వేలుపట్టి నడిపిస్తున్న మార్గదర్శి. ఆయన నిలుదెత్తు మూర్తీభవించిన విగ్రహం మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బుద్దునికి, నూతన సచివాలయానికి సమీపాన నెలకొల్పడం మనందరికీ గర్వకారణం.
– డాక్టర్ కల్వకుంట్ల రామకృష్ణ, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్
భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా
అంబేదర్ విశ్వమానవుడు. అతని ఆలోచనా విధానాన్ని యూఎన్వో గుర్తించి ఆయన జన్మదిన సంవత్సరాన్ని జ్ఞానసంవత్సరంగా ప్రకటించింది. అంబేదర్ తన జీవితంలో ప్రతీ క్షణం ప్రజలు, దళిత వర్గాలు, భారత సంస్కృతి, భారత నాగరికత గురించే ఆలోచించారు. ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రపంచ రాజ్యంగాలను పరిశీలించిన మేధావులు సైతం అంబేద్కర్ రాసిన రాజ్యంగం ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా గుర్తించారు. అందులో సాంఘిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సాధించాలంటే దేశ ప్రజల్లో సోదరభావం ఉండాలని భావించారు. అందుకు కుల వ్యవస్థ, ఆర్థిక అసమానతలు వైదొలగాలని సూచించారు. దేశంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు రాజ్యాంగంలో అనేక అధికరణలు పొందుపరిచారు. ప్రతి వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా ఉన్నతి సాధించేలా రాజ్యాంగం రంచించారు. అంతటి మహోన్నత వ్యక్తికి తెలంగాణలో సముచిత గౌరవం దక్కుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ట్యాంక్బండ్ వద్ద నెలకొల్పడం శుభపరిణామం. ఇది భావితరాలకు ఉపయోగపడేలా.. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటుంది.
– కేతిరెడ్డి రఘోత్తంరెడ్డి, ప్రముఖ న్యాయవాది (మంథని)
ఆయనో వ్యక్తి కాదు, ఒక శక్తి
అంబేద్కర్ అణగారినవరాల కోసమే కాదు, భారత సమాజం శ్రేయస్సు కోసం ఆయన రూపొందించిన వ్యవస్థే భారత రాజ్యాంగం. సామాజిక అంతరాల అంతానికి అంబేద్కర్ విద్యను ఒక ముఖ్యమైన సాధనంగా భావించారు. అన్ని సామాజిక ఉద్యమాల్లో విద్య ఒక నైతిక ఆయుధమని, మనం ఎంత విద్యావంతులైతే ప్రగతికి అంత అవకాశాలు లభిస్తాయన్నది ఆయన ఆలోచన. కులవివక్ష లేని సమానత్వం కోసం కృషి చేశారు. ప్రజలందరికీ సమానత్వాన్ని రూపొందించారు. సామాజిక సమస్యలే కాదు, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సమష్టి సాగు పద్ధతులను ప్రోత్సహించాలని చెప్పారు. బీఆర్ అంబేద్కర్, హిల్టన్ యంగ్ కమిషన్కు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగానే దేశంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏర్పాటై, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. 1951లో ఆర్థిక సంఘాన్ని అంబేద్కర్ ఏర్పాటు చేయించారు. దేశంలో కార్మిక, ఉద్యోగ పని గంటలను 12 నుంచి 8 గంటలకు తగ్గించేలా చేసింది ఆయనే. దేశంలో బహుళార్దక సాధక నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ శక్తి అభివృద్ధికి రూపకల్పన ఆయన కృషే. విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ కోసం సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డు ఆయన దూరదృష్టి వల్లే ఏర్పడింది. మహిళా కార్మిక సంక్షేమ నిధి, మహిళలు, బాల కార్మికుల రక్షణ చట్టం, మహిళలకు ప్రసూతి సెలవులు ఇలా అనేక హక్కులు భారతీయులకు దాఖలు పడడానికి కారణం అంబేద్కరే. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. ఒక శక్తి. ఒక నమ్మకం.
– డాక్టర్ మామిడిపెల్లి సత్య ప్రకాశ్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ (జగిత్యాల)
దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆర్టికల్-3ని రాజ్యాంగంలో అంబేద్కర్ చేర్చకపోతే ఈరోజు తెలంగాణ ఏర్పడేదే కాదు. మాలాంటి ఎన్నో దళిత కుటుంబాలు బాగుపడుతున్నయ్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఇది మన తెలంగాణకే కాదు, యావత్ భారత దేశానికి గర్వకారణం. దళితబంధు అమలు చేయడమే కాకుండా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగిస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఎప్పటికీ దళితుల పక్షపాతిగా చెప్పవచ్చు. ఆనాడు అంబేద్కర్ కన్న కలలను ఇప్పుడు కేసీఆర్ నిజం చేస్తున్నారు. ఆయనలా అందరు ముఖ్యమంత్రులు ఆలోచిస్తే దేశంలోని దళితులు ఇప్పటికే అభివృద్ధి బాటలో పయణించేవాళ్లు.
– ఆకునూరి విన్నర్, దళితబంధు లబ్ధిదారుడు, సిర్సపల్లి (హుజూరాబాద్)
అంబేద్కర్ అందరికీ దేవుడు
అంబేద్కర్ దీనజనులకు దేవుడులాంటి వాడు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో. ఆయన మన రాజ్యాంగాన్ని రూపొందించడమే కాకుండా, రాబోయే తరాలకు మార్గదర్శనం చేశారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలు, స్త్రీల సంక్షేమంపై ముందే అనేక చట్టాలను రూపొందించి ఎంతో మేలు చేశారు. స్త్రీలు చదువుకోవాలి, అన్ని రంగాల్లో రాణించాలని బలంగా కోరుకునే వారు. నిమ్న జాతి వాళ్లే కాకుండా మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. కుల, మత. వర్గం అనే భేదాలు లేకుండా సమసమాజ స్థాపనే ధ్యేయంగా రాజ్యాంగాన్ని రాశారు. దేశంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించినట్లు ఆయన రాసిన రాజ్యాంగమే చెబుతున్నది. అంబేద్కర్ను మించిన మేధావి ఈ ప్రపంచంలోనే లేరని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. స్వామి వివేకానంద లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంబేద్కర్. ఆయనలాగే ఈ జాతి ఉన్నతి కోసం అనేక కష్టాలు పడ్డారు. తన జీవితాన్నే త్యాగం చేశారు.
– అడ్వాల సుజాత (ఉపాధ్యాయురాలు), కవయిత్రి, రచయిత్రి, రుద్రమా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు
మనమంతా గర్వించదగ్గ విషయం
బీఆర్ అంబేదర్ భారత జాతి రత్నం. దేశాన్ని ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలో ఉండాలని కలలుగన్న స్వాప్నికుడు. దేశం అభివృద్ధి కావాలంటే.. ఆ దేశంలో జీవిస్తున్న ప్రజలు అభివృద్ధి కావాలని చెప్పిన మహనీయుడు. దేశ ప్రజలు తారతమ్యాలతో జీవిస్తుంటే ఆ దేశం అభివృద్ధి కాదని, ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలంటే పాలకుల ఆలోచన కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పిన ధైర్యవంతుడు. అంటే ఆయన ఎంత ముందు చూపున్న వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. వందల ఏండ్ల వరకు దేశ పరిస్థితిని ముందే ఊహించి చెప్పిన ప్రజ్ఞాశాలి. బలహీన ప్రజలను పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఈ దేశ పాలకులది మాత్రమేనని చెప్పారు. అలాంటి పాలనే అందిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పులు తెచ్చిన ఒక గొప్ప నాయకుడు ఆయన. కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధును ఇవాళ దేశమంతటా అమలు చేస్తే దళితుల పరిస్థితి మెరుగుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టి, భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని అంబేదర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మనమంతా గర్వించదగ్గ విషయం. ఆంధ్రాలో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే అల్లర్లు జరిగితే, తెలంగాణలో సచివాలయానికి పేరు పెట్టినప్పుడు ఇక్కడి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ ఎంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారో.. వారి ప్రేమను సీఎం కేసీఆర్ ఏ విధంగా చూరగొంటున్నారో అనేది అర్థమవుతుంది. ఇది ఒక గొప్ప నాయకుని గుణం. ఇదొక దేశ నాయకుడి ఔదార్యం, అట్టడుగు వర్గాలను ధనికులుగా చేసి చాటి చెప్పే ఒక సందర్భం. అంబేదర్ కీర్తిని ప్రపంచానికి చెప్పే విధంగా చేస్తున్నారు. ఒక ఆదర్శనీయమైన పాలకుని నిర్ణయం.
-తగరం శంకర్లాల్, మహనీయుల విగ్రహావిష్కరణ కమిటీ (పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు)
మహనీయుడి బాటలో కేసీఆర్ పాలన
అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు హక్కులు కల్పించకుంటే వంటింటికే పరిమితమయ్యేవారు. చట్ట సభల్లో అడుగు పెట్టే అవకాశాన్ని కల్పించకపోతే మహిళలు రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు. బయటి ప్రపంచం తెలిసే అవకాశం ఉండేది కాదు. దేశంలోని మహిళల గురించి ఆలోచించి రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించారు. అట్ల చేయకుంటే ఇపుడు మహిళలకు గుర్తింపు అనేదే ఉండకపోయ్యేది. ఆడపిల్లలంటే తల్లిదండ్రులు కూడా చులకనగా చూసేవాళ్లు. నేను సర్పంచ్గా నా గ్రామాన్ని పాలిస్తున్నా అంటే అందుకు కారణం అంబేద్కరే. రిజర్వేషన్లు అనేవి అంబేద్కర్ ఇవ్వకుంటే నేను మగవాళ్ల మీద పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది కాదు. ఆ మహనీయుడి ఆలోచనలకు అనుగుణంగానే రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగిస్తున్నరు. దళితబంధు పథకం పెట్టి దళితులను పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నరు. హైదరాబాద్లో అంబేద్కర్కు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. బాబా సాహెబ్ అంటే మా మహిళలకే కాదు.. దేశంలో ఎవరికైనా ఇష్టమైన నాయకుడే.
– వేముల లావణ్య, మధురానగర్ సర్పంచ్ (గంగాధర)
ఆయనే లేకుంటే మేం ఏమయ్యేవారమో..
అంబేద్కర్ లేకుంటే దళిత వర్గాలు ఏమై పోయేవో ఊహించడమే కష్టం. దేశంలో సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి ఎంత చెప్పినా తక్కువే. నిమ్న వర్గాలు ముఖ్యంగా దళితుల్లో చైతన్యం తెచ్చి వారికొక వెలుగు రేఖలా నిలిచారు. ఆయన్ను దళితులకే పరిమితం చేయడం సరికాదు. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడిగా ఉండి దేశానికి ఒక చక్కటి లికిత పూర్వకమైన రాజ్యాంగాన్ని అందించారు. మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచింది. దాని వల్లే ఈ నాడు దేశం ఇంత పటిష్టంగా, సుభిక్షంగా ఉంది. అంటరాని కులంలో పుట్టిన ఆయన, అదే అంటరాని తనం నిర్మూలన కోసం కృషి చేశారు. కానీ అంటరానివాడిగా మాత్రం మిగిలిపోలేదు. గొప్ప మానవ సంబంధాలను నెలకొల్పి దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేశారు. అందుకే బాబాసాహెబ్ను ఒక కులానికి, మతానికి పరిమితం చేయరాదు. జాతిరత్నంగా గుర్తించాలి. యావత్ దేశ ప్రజలకు వెలుగు చూపిన గొప్ప దార్శనికుడిగా చూడాలి.
– జక్కుల చంద్రయ్య, అంబేద్కరిస్ట్
దేశ ప్రజలకు సర్వ హక్కులు
అంబేద్కర్ అంతటి ఆదర్శమూర్తి మరొకరు లేరు. ఆయనపై బుద్ధుడి బోధనలు ఎంతో ప్రభావం చూపాయి. ఆ సమతావాది స్ఫూర్తితోనే భారత రాజ్యాంగాన్ని రచించారు. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించారు. సామాజిక అసమానతలను రూపుమాపడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లు కల్పించారు. మనిషి తన హక్కులకు భంగం వాటిల్లినపుడు నేరుగా ఉన్నత న్యాయస్థానాలకు ఆశ్రయించే విధంగా ఆర్టికల్-32ను అందించారు. ఆర్టికల్ -19 ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్-21 ద్వారా జీవించే హక్కును కల్పించారు. ఆర్టికల్ -25 ద్వారా మత స్వేచ్ఛను, ఆర్టికల్ 39-ఏ ద్వారా సమ న్యాయం, ఉచిత న్యాయం అందించారు. అన్నింటికంటే ముఖ్యంగా చదువు, కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించి శాసన అధికారులను ఎన్నుకునే హక్కును ఇచ్చారు. పూలే, సావిత్రి బాయి స్ఫూర్తితో ఉచిత నిర్భంద విద్య చట్టం తెచ్చారు. మతం, జాతి, కులం, ప్రాంతం అనే భేదం లేకుండా వివక్షను నిషేధించారు. దేశంలోని అన్ని కులాలు, మతాలు, సంస్కృతి, ప్రాంతాల వారిని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని రచించారు. అందుకే అంబేద్కర్ దేశం గర్వంగా చెప్పుకుంటున్నది. తెలంగాణ సర్కారు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నది.
– పూరెళ్ల రాములు, న్యాయవాది (కరీంనగర్)
అన్ని వర్గాలకు రిజర్వేషన్లు
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజలు అన్ని విధాలుగా వెనుకబడే ఉన్నారు. వారికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ద్వారా బీసీలకు, 341 ద్వారా ఎస్సీలకు, 342 ద్వారా ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేశారు. అంబేదర్ అందరివాడు అని తెలుసుకోవాలి. ఆయన ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆయన గొప్పతనానికి నిదర్శనంగా అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయడం గర్వకారణం.
– వీరగోని ఆంజనేయులు గౌడ్ రిటైర్డ్ టీచర్ (వేములవాడ)
సీఎం కేసీఆర్తోనే ఆశయ సాధన
ప్రజాస్వామ్య దేశంలో భవిష్యత్తు తరాలకు మేలు జరగాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగాన్ని రాశారు. అందులోని ఆర్టికల్-3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆ మహనీయుని స్ఫూర్తితో పాలకులు, ప్రజలు న్యాయబద్ధంగా నడుచుకుంటున్నారు. తెలంగాణ సర్కారు అన్నింటా ఆయన ఆశయ సాధనను కొనసాగిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడం, హైదరాబాద్ నగరంలో అత్యంత ఎత్తైన విగ్రహం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయించడం సంతోషకరం. ఆయన ఆశయ సాధనకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.
– పాకాల శంకర్గౌడ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు (రాజన్న సిరిసిల్ల)
రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తి కలిగేలా..
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ తన జీవితంలో ఎన్నో అవమానాలను, అసమానతలను భరించారు. తన లాగా ఈ సమాజంలో ఎవరూ అవమానాలకు గురికావద్దని, కష్టాలు పడద్దని ముందు చూపుతో సమాజం గురించి ఆలోచించి అందరివాడు అయ్యారు. చదువు అనే ఆయుధం ద్వారానే సమానత్వాన్ని సాధిస్తామని పేర్కొన్న గొప్ప వ్యక్తి ఆయన. అంబేద్కర్ రాజ్యాంగం ఏదో ఒక కులం గురించో.. మతం గురించో రాసింది కాదు. యావత్ దేశ ప్రజలకు ప్రయోజనం కలిగేలా భారత రాజ్యాంగ రచన జరిగింది. మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులే. రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తి కలిగేలా.. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో 125అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటు చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు.
– సయ్యద్ అజీజ్, వైద్యుడు (పెద్దపల్లి)
తెలంగాణలో అన్ని వర్గాలకూ సంక్షేమం
మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకతత్వానికి చిహ్నమైన మన దేశంలో మైనార్టీల హక్కులను కాపాడుతూనే మెజార్టీ ప్రజలు తమ రాజ్యాంగ హక్కులను అనుభవిస్తున్నారు. ఒకప్పుడు పరిపాలనా పరమైన పదవులకు దూరంగా ఉన్న సామాజిక వర్గాలు ఈరోజు అత్యున్నతమైన రాష్ట్ర పదవిని కూడా అలంకరించే స్థాయికి చేరుకున్నారు. ఇదంతా మన ప్రజాస్వామ్యం గొప్పతనం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలాలే. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తున్నది. అన్ని వర్గాలకూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం. దేశంలోనే అతి ఎత్తయిన మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది.
– గన్నమనేని శ్రీనివాసరావు, పీఆర్టీయూ జిల్లాధ్యాక్షుడు (రాజన్న సిరిసిల్ల జిల్లా)