కరీంనగర్కు మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే వంతెన పూర్తికాగా, అప్రోచ్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన యంత్రాంగం, లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో కార్మికులతో మూడు షిప్టులూ పనిచేయిస్తుండగా, 60 శాతం మేర కంప్లీట్ అయింది. త్వరలోనే పూర్తికానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 13 : కరీంనగరానికి తలమానికంగా నిలిచిన కేబుల్ బ్రిడ్జి త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తికాగా, అప్రోచ్ రోడ్ల పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు ఇటు కరీంనగర్.. అటు మానకొండూర్ వైపు కూడా అప్రోచ్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి.
కరీంనగర్ నుంచి మానకొండూర్కు వెళ్లే పాత రహదారిలోని మానేరు నదిపై 224 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో 47.3 కోట్లను అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి కేటాయించారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులను టాటా కన్సల్టెన్సీ పూర్తి చేసింది. అలాగే అప్రోచ్ రోడ్డు పనులను ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం మేర పూర్తయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ బ్రిడ్జిని నెల రోజుల్లోగా ప్రారంభించే విధంగా పనులు పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఆర్అండ్బీ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, మిగిలిన 40 శాతం పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మూడు షిఫ్టుల్లోనూ కార్మికులను నియమించి పనులు సాగిస్తున్నారు.
వర్షాలు పడుతుండడం వల్ల పనుల్లో ఆలస్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి నుంచి మానకొండూర్ రోడ్డు వైపుగా అల్గునూర్ పరిధిలో అప్రోచ్ రోడ్డుకు సంబంధించి మట్టి పనులు పూర్తి కాగా, బీటీ రోడ్డు పనులు చేపట్టాల్సి ఉన్నది. అయితే, బ్రిడ్జి అనుసంధానానికి సంబంధించి పనుల్లో 10 లిప్టులకుగాను ఇప్పటికే ఐదు లిప్టుల బిగింపు పూర్తికాగా, మిగతావి ఈ నెలలో కంప్లీట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి నుంచి కరీంనగర్ వైపు అప్రోచ్ రోడ్డు పనులకు సంబంధించి బేస్లెవల్ పనులు సాగుతున్నాయి. క్లోజ్వాల్స్ పనులను పూర్తి చేసి మిగిలిన వాటిని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే హౌసింగ్బోర్డు కాలనీ నుంచి కమాన్ దాకా ఉన్న రోడ్డుల్లో మిగిలిపోయిన మంచినీటి పైపులైన్, భూగర్భ డ్రైనేజీ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి పూర్తయితే బీటీ రోడ్డు వేస్తామని అంటున్నారు.
నిరంతరం పర్యవేక్షణ
అప్రోచ్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్తో పాటు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ ఈ పనులకు సంబంధించి కలెక్టరేట్లో ప్రత్యేకంగా అధికారులతో సమీక్షించారు. గత నెల రోజుల్లోనే కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ రోడ్డు పనులను నాలుగు సార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆర్అండ్బీ అధికారులు సైతం పనులను వేగవంతం చేశారు. మరోవైపు ఈ రోడ్డుకు ఇరువైపులా వీధిదీపాల ఏర్పాటు పనులూ చకచకా చేస్తున్నారు.
6.50 కోట్లతో కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైట్స్
కేబుల్ బ్రిడ్జిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు 6.50 కోట్లతో డైనమిక్ లైట్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో వేగంగా పనులు జరుగుతున్నాయి. వీటిని కూడా లక్ష్యం మేరకు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.