కోనరావుపేట/ వేములవాడ టౌన్, జనవరి 7: కాలేయ సంబంధింత సమస్యతో బాధపడుతున్న ఆ బాలుడిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. లివర్ మార్పిడి చికిత్సకు 44 లక్షలకు పైనే అవసరం కాగా, దాతల కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేసి తమ కొడుకుకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో నిరుపేద కుటుంబానికి చెందిన ఉలిసె చందు-పల్లవి దంపతులకు కూతురుతోపాటు కొడుకు నిహాల్(8) ఉన్నారు.
నిహాల్ మూడో తరగతి చదువుతున్నాడు. పదిహేను రోజుల క్రితం పచ్చ కామెర్లు వచ్చాయని సిరిసిల్లలోని ఓ దవాఖానకు తీసుకెళ్లగా కాలేయ సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానకు బాలుడిని తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, బాలుడికి లివర్ సంబంధింత సమస్య ఉందని, మార్పిడి (ట్రాన్స్ప్లాంటేషన్) చేయాలని చెప్పారు. వెంటనే సమాచారం అందుకొని తండ్రి చందు దుబాయి నుంచి వచ్చాడు.
తన కొడుకు పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. అనంతరం వైద్యులను కలిశారు. లివర్ ప్లాంటేషన్కు ముందుకు రాగా, ఇద్దరికీ వైద్య పరీక్షలు చేశారు. అనంతరం తల్లి కాలేయ భాగం బిడ్డకు సెట్ అవుతుందని నిర్ధారించారు. అయితే ఈ చికిత్సకు సుమారు 44లక్షల నుంచి 55లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు సాయం కోసం అర్థిస్తున్నారు. తమ కొడుకును బతికించాలని వేడుకుంటున్నారు. దాతలు గూగుల్పే, ఫోన్పే (90005-57271) ద్వారా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. కాగా, వైద్య చికిత్స కోసం ‘మై వేములవాడ’ చారిటబుల్ ట్రస్టు సభ్యులు ఆదివారం నిహాల్ కుటుంబసభ్యులకు 22,153 చెక్కును అందించారు. ఇక్కడ ట్రస్ట్ సభ్యులు మధుమహేశ్, డాక్టర్ బెజ్జంకి రవీందర్, మహ్మద్ అబ్దుల్ రఫిక్, కొప్పుల హనుమాన్, గొంగళ్ల రవికుమార్, చల్ల సత్తయ్య ఉన్నారు.