కలెక్టరేట్, జూలై 5 : నగరంలో గ్యాస్ డెలివరీ పేర ఆయా ఏజెన్సీల్లోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సర్వీస్ చార్జి పేరిట వినియోగదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సిలిండర్కు చెల్లించాల్సిన ధర కన్నా రూ.20 నుంచి రూ. 50 దాకా అదనంగా చెల్లిస్తేనే సిలిండర్లు అందజేస్తాం.. లేకుంటే వాపస్ తీసుకెళ్తామంటూ బెదిరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రసీదుపై ఉన్న ధర ప్రకారమే డబ్బులు చెల్లిస్తామంటే ససేమిరా అంటూ దురుసుగా మాట్లాడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. సిబ్బంది ఆగడాలపై ఆయా ఏజెన్సీలు, సంబంధితాధికారులకు ఫిర్యాదు చేసినా చోద్యం చూస్తున్నారే తప్ప, చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఏజెన్సీ పరిధిలో 12 కిమీలలోపు ఉచిత డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇందుకయ్యే రవాణా ఖర్చులు కూడా ముందుగానే బిల్లులో చేర్చుతారని పౌరసరఫరాల శాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు. అయితే, ఇందుకు విరుద్ధంగా గ్యాస్ ఏజెన్సీల సిబ్బంది వ్యవహరిస్తూ, ఇంటి యజమానుల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నట్లు పలు సందర్భాల్లో ప్రజావాణిలో సైతం వినియోగదారులు ఫిర్యాదులు చేసిన ఘటనలున్నాయి. వీటిపై ఆయా ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతోనే సిబ్బంది ఆగడాలు మితిమీరుతున్నాయనే చర్చ నడుస్తున్నది. ఇళ్లలో మహిళలు, వృద్ధులు ఒంటరిగా ఉన్నపుడు ఇలా ప్రవర్తిస్తే భయానక వాతావరణం ఏర్పడి, ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకుంటాయని అధికారులు సైతం హెచ్చరిస్తున్నా, ఏజెన్సీల నిర్వాహకుల అలసత్వంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, సంబంధిత సిబ్బంది తీరుపై వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, తాజాగా జరిగిన ఘటనపై సదరు వినియోగదారుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏజెన్సీల సిబ్బంది అదనపు వసూళ్ల చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ నెల 3న నగరంలోని భగత్నగర్ ప్రాంతానికి చెందిన గ్యాస్ ఏజెన్సీలో వినియోగదారుడు సిలిండర్ బుక్ చేయగా, ఈనెల 4న హోమ్ డెలివరీ కోసం సిబ్బంది గ్యాస్ సిలిండర్ తెచ్చారు. ఆసమయంలో ఇంటి యజమాని లేకపోగా ఇంట్లో ఉన్నవారిని ఓటీపీ అడిగారు. సిలిండర్ డెలివరీ కోసం అదనంగా రూ.50 చెల్లించాలని, కనీసం రూ.20 అయినా ఇస్తేనే ఫుల్ సిలిండర్ ఇస్తా.. లేకుంటే ఇవ్వనంటూ మొండికేసినట్లు సదరు వినియోగదారుడు పేర్కొన్నారు. ఏజెన్సీ యజమానికి, పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తే, వెక్కిరింపు మాటలతో ఆ ఇంట్లోని మహిళలను బెదిరించినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.