Boinpally | బోయినపల్లి రూరల్, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ సీఎం కేసీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కత్తెరపాక కొండయ్య విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన భూముల ఆరోపణలపై శుక్రవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, పింఛన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ వంటి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేక పోయిందని విమర్శించారు. ఈ ప్రజా సమస్యలపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చూసేందుకే కేసీఆర్ ఆస్తులు అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందంటూ ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్ కు కేవలం 67 ఎకరాల భూమి మాత్రమే ఉందని ఒప్పుకున్నారని, దీన్ని బట్టి వారి ఆరోపణల్లో నిజం లేదని స్పష్టమవుతోందని గుర్తు చేశారు.
కేసీఆర్ ఆస్తులపై ప్రశ్నించడం కన్నా ముందు, రేవంత్ రెడ్డి జడ్పీటీసీ గా ఉన్నప్పుడు ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తి ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ఆస్తులు పెరిగాయో ప్రజలకు, అసెంబ్లీకి వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే తనతో పాటు తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రజల ముందుంచిన తర్వాతే కేసీఆర్ ఆస్తుల గురించి మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలతో కాలం వెళ్లదీయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై చేస్తున్న బురదజల్లే రాజకీయాలను భరిస్తూ ఊరుకోమని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కొండయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ ఎంపీటీసీ ఈడుగు స్వామి, నాయకులు కవ్వంపల్లి రాములు, అక్కనపల్లి కరుణాకర్, బత్తిని కమల్ గౌడ్, కన్నం సాగర్, సుధాకర్, దూస మధు తదితరులు పాల్గొన్నారు.