MLC Kalvakuntla Kavitha | జగిత్యాల, జూన్ 16 : అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, నడిసేటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత స్పష్టం అన్నారు. జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు సంప్రదాయ బద్దంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీ దామోదర్ రావు, ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారని, అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత మరో రూ.10 లక్షలు ఇచ్చారన్నారు.
రాష్ట్రంలో వానాకాలం పంట సీజన్ మొదలైందనీ, రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందన్నారు. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చిందని, మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలనీ డిమాండ్ చేశారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా, రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పింఛన్లు పెంచలేదని, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదనీ, ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసిందన్నారు. హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందన్నారు.
మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ని విచారణ చేసిందని, సోమవారం కేటీఆర్ ని ఏసీబీ విచారిస్తోందన్నారు. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదనీ, కేటీఆర్ విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమని, మా పార్టీ కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. అనంతరం కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.