ప్రత్నామ్నాయ పంటల సాగులో భాగంగా ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో రాయితీలు కూడా ఇస్తుండడంతో పాటు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం అధిక ఆదాయాన్ని ఇచ్చే పంట కావడంతో అన్నదాతలు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. నాలుగేళ్లలో సుమారు 45వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధం చేయగా, ఈ ఏడాది 10 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే గుర్తించిన రైతుల క్షేత్రాల్లో ఈ వారంలోనే మొక్కలు నాటేందుకు ఉద్యాన, వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముకరంపుర, జనవరి 3: జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూలమైన నేలలతో పాటు అనువైన వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్లలో 45వేల ఎకరాల సాగుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది 10వేల ఎకరాల్లో ఆయిల్పామ్ మొ క్కలు నాటించేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు 500మంది రైతులు అశ్వారావుపేటలో అవలంభిస్తున్న సాగువిధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1500ఎకరాలు గుర్తించారు. ఈ నెల మొదటి వారంలోనే రైతుల క్షేత్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టేలా చర్యలు చేపట్టారు.
పంపిణీకి సిద్ధంగా 3.50లక్షల మొక్కలు
జిల్లాలో నర్సరీ నిర్వహణ, సాగు విధానాలు, రైతులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడం, ఆయిల్ పరిశ్రమ ఏర్పాటు బాధ్యతను ప్రభుత్వం లోహియా కంపెనీకి కేటాయించింది. చిగురుమామిడిలో 110ఎకరాల్లో నర్సరీని ఏర్పాటు చేసింది. సుమారు 12వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు షేడ్ నెట్లు నిర్మించి మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఏడాది పాటు పెంచిన మొక్కలు 11ఆకుల దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 3.50లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని నేలల స్వభావం, వాతావరణానికి అనువైన ‘ డెల్లి ఎక్స్ లామె’ రకానికి చెందిన సుమారు 11.44లక్షల ఆయిల్పాం మొలకలు కోస్టారికా, థాయిలాండ్, కామెరూన్ నుంచి జిల్లాకు దిగుమతి అయ్యాయి. ఈ రకం ఎకరానికి 10టన్నుల వరకు దిగుబడి ఇవ్వడంతో పాటు మొక్క చాలా తక్కువ ఎత్తు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 1330ఎకరాలకు గాను 454మంది రైతులు డీడీలు చెల్లించారు.
నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు
ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నిర్వహణ, అంతర పంటల సాగుకోసం ఏటా రూ.5,250 అందిస్తున్నది. ఎకరం విస్తీర్ణంలో 57మొక్కలు మాత్రమే నాటే వీలుంటుంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల పాటు అంతర పంటలు వేసుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నది. అధికారులతో కలిసి కంపెనీ ప్రతినిధుల బృందం రైతుల క్షేత్రాలను పరిశీలించి సాగు విధానాలను వివరించడంతో పాటు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ సాంకేతిక సూచనలు, సలహాలు ఇస్తారు.
రాయితీపై డ్రిప్, మొక్కలు
ఆయిల్పామ్ పంటకు నీటి వసతి ప్రధానం. వరి, ఇతర పంటలతో పోల్చుకుంటే చాలా తక్కువ పరిమాణంలోనే నీటి వినియోగం ఉంటుంది. నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రభుత్వమే రాయితీపై డ్రిప్ను బిగిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100శాతం, బీసీలకు 90శాతం, ఓసీలకు 80శాతం రాయితీతో డ్రిప్ను అందిస్తున్నది. మొక్క పూర్తి ధర రూ.195కాగా రాయితీపై రూ.20కు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
నాలుగేళ్లలో అందుబాటులోకి ఫ్యాక్టరీ
ఆయిల్పామ్ మొక్కలు నాటిన నాలుగేళ్లలో దిగుబడి ప్రారంభమవుతుంది. ఈలోగా లోహియా కంపెనీ జిల్లాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉంటుం ది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దిగుబడి ప్రా రంభమైన వెంటనే గ్రామాల వారీగా గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎకరానికి 10టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతుల నుంచి కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు తరలిస్తారు.
మూడు క్షేత్రాల్లో సాగు
జిల్లాలో ఇప్పటికే మూడు క్షేత్రాల్లో ఆయిల్పామ్ సాగవుతున్నది. కాజీపూర్లో బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సుమారు 32ఎకరాల్లో, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఐదెకరాల్లో, మానకొండూర్ మండలం వేగురుపల్లిలో మరో రైతు మొక్కలు నాటారు. ఏడాది క్రితం నాటగా ప్రస్తుతం ఏపుగా ఎదిగాయి.
నేడు రైతులకు అవగాహన
ఆయిల్పాం సాగుపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొక్కలు నాటే విధానం, నీటి యాజమాన్యం, ఇతర అంశాలపై అధికారులు విపులంగా వివరించనున్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు హాజరవుతారని అధికారులు తెలిపారు.
రైతుల నుంచి మంచి స్పందన
జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు రై తుల నుంచి మంచి స్పందన వ స్తుంది. తక్కువ వ్యయంతో దీర్ఘకాలంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. దిగుబడిని స్థానికంగానే లో హియా కంపెనీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయనుంది. ఒక సారి నా టితే సుమారు 30ఏళ్ల వరకు మంచి ఆదాయం వస్తుంది.
– బండారి శ్రీనివాస్, ఉద్యాన పట్టుపరిశ్రమ శాఖ అధికారి