పెగడపల్లి, ఏప్రిల్ 2 : కొన్నేళ్లుగా సమస్యలతో సతమతమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ చేకూరింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు మన బడి పథకం వల్ల పాఠశాల రూపు రేఖలు మారి పోయాయి. గత కొన్నేళ్లుగా పాఠశాలలో నెలకొన్న సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. సుమారు రూ.40 లక్షల నిధులతో పాఠశాలలో అనేక అభివృధ్ది పనులు చేపట్టడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో పాఠశాల పూర్తి అధ్వానంగా మారింది. ఈ క్రమంలో సుమారు రూ.19 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు.
తరగతి గదుల్లో ఫ్లోరింగ్, విద్యుత్ పనులు, తరగతి గదుల్లో సీలింగ్ ప్యాన్లు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని గదులకు రంగులు వేసి నూతనంగా తీర్చిదిద్దారు. రూ.5 లక్షలతో అధునాతన మరుగుదొడ్లు, రూ.3.5 లక్షలతో ప్రత్యేక వంట గది, నీటి నిల్వకు సంపు నిర్మించారు. దీంతో పాటు రూ.10 లక్షలతో పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. 7 తరగతి గదుల్లో గ్రీన్ చాక్ పెయింటింగ్ బోర్డులు, విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, పాఠశాల ఎదుట స్థలం కోసం గ్రౌండ్ ఏర్పాటు పనులను చేపట్టారు. పాఠశాలలో 7 తరగతులు ఉండగా, 120 మంది విద్యార్థులు ఉన్నారని, ఒక్క హెచ్పీటీ పోస్ట్ ఖాళీగా ఉందని, పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటయ్యాయని హెచ్ఎం సత్యనారాయణ పేర్కొన్నారు. మన ఊరు మన బడి పథకంలో మద్దులపల్లి పాఠశాలను ఎంపిక చేసి, అభివృద్ధి పనులు చేపట్టడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్కు సర్పంచ్ గుర్రం అనూష-మల్లారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ లోక నిర్మల-మల్లారెడ్డి, ఎంపీటీసీ గుర్రం స్వాతి-తిరుపతిరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ తోడేటి వెంకటేశ్, పాఠశాల హెచ్ఎం రామోజు సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాలలో సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి
మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాలలోని సమస్యలన్నీ తొలగిపోయాయి. మద్దులపల్లి పాఠశాలలో ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించింది. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం సుమారు రూ.40 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుంది. తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలి.
– రామోజు సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం
ప్రైవేట్కు దీటుగా సౌకర్యాలు
మద్దులపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా సౌకర్యాలు ఉన్నాయి. మన ఊరు మన బడి పథకంతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. కొన్నేళ్లుగా పాఠశాలలో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు మన బడి పథకం వల్ల పాఠశాలకు మంజూరైన నిధులతో అన్ని రకాల మౌలిక వసతులు కలుగడంతో సమస్యలు తొలగిపోయాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో పాఠశాలకు పూర్వ వైభవం సంతరించుకుంది.
– గుర్రం అనూష-మల్లారెడ్డి, సర్పంచ్