అత్యవసర చికిత్సకు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు.. అత్యాధునిక వైద్య పరికరాలు.. అపార అనుభవమున్న వైద్య సిబ్బంది.. ఆధునిక అంబులెన్స్లు ఇంకా మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణ కోసం మమోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రేలు, 57రకాల రక్త పరీక్షలు, కడుపులో శిశువు ఎదుగుదలను తెలుసుకునే టిఫా స్కాన్తో ఏర్పాటైన రేడియాలజీ హబ్.. ఇలా కార్పొరేట్కు దీటుగా సకల వసతులతో జిల్లాకేంద్రంలోని ప్రధాన దవాఖాన సేవలందిస్తున్నది. హై రిస్క్ కేసులనూ సులువుగా పరిష్కరిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నది. ఈ మేరకు సేవలను మరింత విస్తృతం చేయాలని భావించిన సర్కారు, త్వరలోనే టుడీ ఇకో, సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తేబోతుండగా, రోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– విద్యానగర్, ఏప్రిల్ 16
విద్యానగర్, ఏప్రిల్ 16 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలందిస్తున్నది. ఇందుకు నిదర్శనమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్. ఇందులో మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణ కోసం మమోగ్రఫీ పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. మమోగ్రఫీ ప్రైవేట్ దవాఖానాల్లో చేయించుకుంటే రూ.3 వేల నుంచి 5 వేల దాకా ఖర్చవుతుంది. డిజిటల్ ఎక్స్రేల కోసం రూ.300 నుంచి రూ.500 దాకా వెచ్చించాల్సి ఉంటుంది. పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలతో పాటు పరీక్షలు చేస్తున్నారు. టుడీ ఇకో మిషన్ వచ్చినప్పటికీ గుండె వ్యాధి నిపుణులు, టెక్నీషియన్ లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదు. త్వరలోనే వైద్యులు, సిబ్బందిని నియమిస్తామని అధికారులు తెలిపారు. గతంలో పది రకాల పరీక్షలకే పరిమితమైన వైద్య సేవలు ప్రస్తుతం 57రకాల రక్త పరీక్షలతో పాటు ఎక్స్రేలు, టిఫా స్కాన్లు అందుబాటులోకి తేగా, ప్రజాదరణ పెరిగింది. కాగా, త్వరలోనే టుడీ ఎకో, సిటీ స్కాన్, ఎంఆర్ఐ సైతం ఏర్పాటు చేస్తామని మంత్రి గంగుల చెబుతున్నారు.
ఓపీ రెండింతలు..
సమైక్య పాలనలో అధ్వానంగా మారిన దవాఖానలను స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు బలోపేతం చేసింది. దీంతో అప్పటిదాకా ప్రైవేట్ బాట పట్టిన రోగులు సర్కారు దవాఖానల బాటపట్టారు. కాగా, జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానలో రోజుకు 500కు పైగా మాత్రమే ఓపీ (అవుట్ పేషెంట్), 400 మంది ఇన్పేషెంట్లుగా ఉండేవారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి పరీక్ష ఇక్కడే అందుబాటులోకి రావడం, ఆధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతో రోగుల తాకిడి మరింత పెరిగింది. ప్రస్తుతం రోజుకు వెయ్యి మందికి పైగా ఓపీ సేవలు వినియోగించుకుంటున్నారు.
ప్రజాదరణ పెరిగింది..
దవాఖానలో గతంలో 500కు పైగా మాత్రమే ఓపీ (అవుట్ పేషెంట్) వచ్చేవారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో మందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం, వైద్యశాలను సైతం ఎప్పటికపడు పరిశుభ్రంగా ఉంచుతుండడంతో ఓపీ సంఖ్య వెయ్యికి పైగా పెరిగింది. ఇన్ పేషెంట్లు సైతం 400కు పైగానే ఉంటున్నారు. రోగులకు కావాల్సిన పూర్తి పరీక్షలు, మందులతో పాటు ఆహారం, టిఫిన్ అందిస్తుండడంతో దవాఖానపై ప్రజాదరణ పెరిగింది. ఎంసీహెచ్లో సైతం ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది.
– రత్నమాల, దవాఖాన సూపరింటెండెంట్