గంగాధర, డిసెంబర్ 21: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలతో మండలంలో వ్యవసాయాభివృద్ధి జరిగింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, 24 గంటల విద్యుత్తో పాటు కాళేశ్వరం జలాలతో మండలంలోని చెరువులు, కుంటలను నింపడంతో వ్యవసాయం దండగ అన్న చోటే పండుగలా మారింది. ఏళ్లకు ఏళ్లు బీళ్లుగా ఉన్న భూములు సాగుకు నోచుకున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏడాదికేడాది ధాన్యం దిగుబడి పెరుగుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 33 గ్రామాలు ఉండగా ఐకేపీ ఆధ్వర్యంలో 11, గంగాధర సింగిల్ విండో ఆధ్వర్యంలో 11, కురిక్యాల సింగిల్ విండో పరిధిలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో 1359 మంది రైతుల నుంచి 72 వేల 608 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కురిక్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 752 మంది రైతుల నుంచి 48 వేల 618 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గంగాధర పీఏసీఎస్ ఆధ్వర్యంలో 810 మంది రైతుల నుంచి లక్షా 5 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఈ వానకాలంలో 33 కేంద్రాల ద్వారా 2921 మంది రైతుల నుంచి 2,26,226 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర పెంచడంతో పాటు రైతులు ఇబ్బందులు పడకుండా కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు.
కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినం. కురిక్యాల సింగిల్ విండో పరిధిలో ఈసారి 11 కేంద్రాల ద్వారా 752 మంది రైతుల నుంచి 48 వేల 618 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినం. కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించినం. మిల్లులో కూడా ధాన్యం త్వరగా అన్లోడ్ కావడంతో ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు పూర్తి చేసినం.
-వెలిచాల తిర్మల్రావు, కురిక్యాల సింగిల్విండో చైర్మన్
మండలంలో 11 కేంద్రాలు ఏర్పాటు చేసి 72,608 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినం. కొనుగోలు చేసిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించినం. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినం. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నది.
-పవన్కుమార్, ఐకేపీ ఏపీఎం
మండలంలో పెరిగిన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గంగాధర సింగిల్ విండో పరిధిలో ఈసారి 11 కేంద్రాల ద్వారా లక్షా 5 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినం. ప్రభుత్వం మద్దతు ధరను పెంచడంతో పాటు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి ధాన్యం వెంట వెంటనే కొనుగోలు చేసినం.
-దూలం బాలాగౌడ్, గంగాధర సింగిల్విండో చైర్మన్