vemulawada | వేములవాడ, జూలై 10 : వారసత్వంగా వచ్చిన భూమిని అన్నదమ్ముల పేరిట విరాసత్ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకొని 15 మాసాలుగా తిరుగుతున్న పనులు కాకపోవడంతో వేములవాడ ఆర్డీవో ఎదుట బాధితుడు బైఠాయించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాధితుడు ఒగ్గు రాజేశం మాట్లాడుతూ కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో సర్వేనెంబర్ 245లో వారసత్వంగా వచ్చిన ఎకరం 10 గుంటలు భూమి తల్లి మరణించిన తర్వాత నలుగురు అన్నదమ్ముల పేరిట విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. మార్చి 2025 సంవత్సరంలో దరఖాస్తు చేసుకోగా 15 మాసాలుగా తిరుగుతున్న ఏదో కారణం చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సర్వే నెంబర్ లో మొత్తం తొమ్మిది ఎకరాలు ఉండగా ఇందులో ఇద్దరికీ మాత్రం 8 మాసాల కిందటే పట్టాలు చేశారని అన్నారు. మాకు మాత్రం పనిచేయడం లేదంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే స్పందించి పనులు చేయాలని ఆదేశించిన ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా ఉన్నందునే తాను కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదనతో తెలిపారు. చివరకు ఏవో స్వరూప చేరుకొని చెక్ లిస్టులో చిన్న సమస్య ఉన్నందున తక్షణమే అందించాలని మండల తహసీల్దార్ అధికారులను ఆదేశించామని తద్వారా సోమవారం పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు నిరసన విరమించారు. కార్యాలయంలో వందల కొద్ది భూభారతి సమస్యలతో కూడిన పనుల దరఖాస్తులు ఉన్నాయని వాటిని చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతోని బాధిత రైతులు అసహనానికి గురవుతున్నారని రాజేశం తెలిపిన నిరసన ద్వారానే అర్థమవుతోందని పలువురు పేర్కొంటున్నారు.